జైల్లో జగన్ మోహన్.. సానుభూతితో ప్రజలు ఓటేస్తారా..?!!
, మంగళవారం, 29 మే 2012 (16:08 IST)
ఇపుడు దీనిపైనా ప్రధాన పార్టీలు చర్చించుకుంటున్నాయి. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు, ఆపై ఆయనకు కోర్టు రిమాండు విధించడంతో జైలుపాలయ్యారు. మరోవైపు వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్సార్ను పొట్టనబెట్టుకున్నారనీ, తన బిడ్డ జగన్ను హింసిస్తున్నారనీ దిల్కుషా అతిథి గృహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరశన తెలిపారు. అనంతరం జగన్కు రిమాండ్ విధించేవరకూ ఇంటి ముందు దీక్ష చేశారు. ఆ పిదప జగన్ జైలుకు వెళ్లడంతో ఇక ప్రచార బాధ్యతలు తీసుకుని 18 నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపును పోటీ చేస్తున్న అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని ప్రకటించారు. రేపటి నుంచి విజయమ్మ పర్యటన ప్రారంభమవుతోంది. ఐతే ఈ సెంటిమెంట్ ఎంతమాత్రం వర్కవుట్ కాదని, తెదేపా - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. గతంలో ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు ఆ సెంటిమెంటుకు రాష్ట్ర ప్రజలు తలవొగ్గలేదనీ, కాంగ్రెస్ పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాలేదని చెప్పుకొస్తున్నారు. ఇక తెదేపా నాయకులయితే 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో నక్సల్స్ దాడి చేయడాన్ని గుర్తుకు తెస్తున్నారు. నక్సల్స్ దాడుల్లో తృటిలో తప్పించుకున్నారనీ, అటువంటి దాడులు జరిగినా జనం ఓట్లు వేయలేదని అంటున్నారు. కనుక జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. జగన్ భారీ అవినీతికి పాల్పడ్డారన్న సంగతి ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందనీ, కోర్టులో పూర్తిగా నిరూపణ అయిన తర్వాత ప్రజలు జగన్ పార్టీని పట్టించుకోరని అంటున్నారు. ఐతే తనపై కేసులు ముందుకు సాగకుండా జగన్ మోహన్ రెడ్డి పలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తమ్మీద ఉప ఎన్నికలు జరుగనున్న 18 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో చూడాలి.