జనశక్తిగా జగన్... లోకేష్కు బీట్ చేసే స్టామినా ఉందా..?!!
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2012 (14:33 IST)
త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర వెనుక స్క్రీన్ప్లే, డైరెక్షన్ అంతా నారా లోకేషే అని అంటున్నారు. అదలావుంచితే తాజాగా తెదేపాలో నారా లోకేష్ కీలక బాధ్యతలను నిర్వహించనున్నారనే వాదనలు వినబడుతున్నాయి. 2014 ఎన్నికలే లక్ష్యంగా నారా లోకేష్ను రంగంలోకి దించుతున్నట్లు తెదేపా నాయకులు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఐతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనశక్తి మారిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నా.... ఆయన శక్తి చాలా తీవ్రంగానే ప్రజల్లో వేళ్లూకుని ఉంది. జగన్ ఎక్కడికెళ్లినా జనం ఆయన వెంట పరుగులు తీస్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి స్పీచ్... చిన్న పిల్లాడి దగ్గర్నుంచి వృద్ధుల వరకూ ఆకట్టుకునేదిగా ఉంటుంది. మొత్తంగా జగన్ జన సమ్మోహన శక్తిగా మారిపోయారు. వైకాపా నాయకులయితే... జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారనీ, తమ జీవితాలను బాగు చేసే ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని అంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న సీన్ ఇది. ఇక నారా లోకేష్ విషయానికి వస్తే... ఇప్పటివరకూ పబ్లిక్ మీటింగుల్లో పాల్గొని ప్రసంగించిన దాఖలాలు కనబడవు.
ఎంతసేపటికి తెరవెనుక ఉండటమే కానీ... ఏ రోజూ జనం ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. గత 2009 ఎన్నికల్లో ఫ్రీ క్యాష్ పథకం లోకేష్ ఐడియానేని బాబు చెప్పినా దానిపట్ల ప్రజలు అంతగా ఆకర్షణ కాలేదు. ఇంకా ఇటీవల పార్టీకి సంబంధించి పలు నిర్ణయాలు లోకేష్ ఐడియాలేనని చెపుతున్నప్పటికీ... అవి ప్రజల్లోకి ఎక్కుతున్న పరిస్థితి కాస్తంత తక్కువేనని చెప్పాలి. మరి 2014 ఎన్నికల నాటికి నారా లోకేష్ జనశక్తిగా మారిపోయిన జగన్ మోహన్ రెడ్డిని ఏమేరకు ఎదుర్కొని తన తండ్రికి సీఎం పీఠాన్ని సాధించి పెడతారో చూడాల్సిందే.