జగన్ పార్టీ జనం మాటలు... అందుకే జగన్కు బెయిల్ రావడం లేదా..?!!
, శుక్రవారం, 10 మే 2013 (19:20 IST)
అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులకు బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. సీబీఐ విచారణ మరోవైపు సాగుతూనే ఉంది. కాగా అసలు బెయిల్ విషయంలో పార్టీ నేతలు, ముఖ్య నాయకులు చేస్తున్న వ్యాఖ్యల వల్లనే జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రావడం లేదన్న కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కొందరు నేతలు నేరుగా కోర్టులు, సీబీఐను విమర్శిస్తుండటంతో వ్యవహారం మరింత బెడిసికొడుతోందనీ, అందువల్లనే జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా పోతోందన్న వాదనలు వినబడుతున్నాయి. గురువారంనాడు సుప్రీంకోర్టు అలా బెయిల్ పిటీషన్ ను తిరస్కిరించిందో లేదో మీడియా ముందు ఆ పార్టీ నాయకులు ప్రత్యక్షమయ్యారు. బొగ్గు కుంభకోణంలో సీబీఐకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన నేపధ్యాన్ని గుర్తు చేస్తూ పంజరంలో చిలుక చెప్పిన మాటలను విశ్వసించిన సుప్రీంకోర్టు జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేదంటూ ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మరో నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి అయితే కోర్టులను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు నాయుడు తనకు సుప్రీంకోర్టునే ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్నదా... అసలు వీళ్లు ఎటు పోతున్నారంటూ ప్రశ్నించారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో వైకాపా నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.