"గాలి" ఎవరో తెలీదు.. జగన్: జగన్ తోబుట్టువు కంటే ఎక్కువ.. "గాలి" మాట
, మంగళవారం, 6 సెప్టెంబరు 2011 (12:42 IST)
గాలి జనార్థన్ రెడ్డి వైఎస్సార్ కుటుంబం అంటే తనకు ఎనలేని ప్రేమ అని చెపుతుండేవారు. అంతేకాదు ఆ మధ్య ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సార్ ప్రోత్సాహం లేనిదే తాను ఇంతటి వాడినయ్యేవాడిని కాదని గాలి వెల్లడించారు. అంతేకాదు జగన్ తండ్రి వైఎస్సార్ తనకు కూడా పితృ సమానుడని కొనియాడారు.ఇక జగన్ మోహన్ రెడ్డి అయితే తనకు తోబుట్టువు కంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఆయనను ఆంధ్రా మధుకొడా అని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించడంపై గాలి ఫైర్ అయ్యారు. స్వయంగా తాను జగన్ మోహన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ లో 1500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టానని చెప్పారు. మరి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎప్పుడైతే గాలి జనార్థన్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నదో వైఎస్ జగన్ మాట మార్చారన్న వాదనలు వినబడుతున్నాయి. ఒకవైపు గాలి జనార్థన్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే జగన్ గురించి మాట్లాడకుండా వెళ్లేవారు కాదంటారు. మరి అటువంటప్పుడు గాలి జనార్థన్ రెడ్డి ఎవరో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదా..? అంటే సందేహాస్పదంగానే ఉందంటున్నారు. గాలి అరెస్టు నేపధ్యంలో జనార్థన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే.. లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయనే ఆందోళన ఉన్నట్లు సమాచారం. కనుకనే ఎందుకొచ్చిన గొడవ... అనుకుని గాలి జనార్థన్ రెడ్డి విషయంలో తెలియదన్నట్లు జగన్ మాట్లాడారని చెపుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఆయన సన్నిహితుల్లో రకరకాల అనుమానాలకు కారణమైందని అంటున్నారు.