Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ కాంగ్రెస్ ఎంపీలు గడ్డి తింటున్నారా: వైఎస్.జగన్మోహన్

Advertiesment
జగన్
, సోమవారం, 12 సెప్టెంబరు 2011 (13:21 IST)
రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల పంపకంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో తీరని అన్యాయం జరిగింది. ప్రతియేటా సంభవించి ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ.. ఏ ఒక్క సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వాపోయారు.

తాను చేపట్టిన రెండో విడత కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన గన్నవరంలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 32 మంది ఎంపీలను ఇచ్చారు. వారందరూ ఏం చేస్తున్నారు. గడ్డి తింటున్నారా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని కళ్లు తెరిచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణాట్రిబ్యునల్ తీర్పును మార్పు చేయడానికి శాయశక్తులా కృషి చేయండని కోరారు.

కృష్ణా ట్రిబ్యునల్ అవార్డే తప్పు. ప్రతి నీటి చుక్కను లెక్కించి మన రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి? పక్క రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి? వేరే రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో నిర్ణయించాలి. నీటిని సక్రమంగా పంచగలిగితే వరదలు వచ్చినప్పుడు వాళ్ల డ్యాములు, మన డ్యాములు కొంచెమైనా ఖాళీ ఉంటాయి.

ఇలా ఖాళీ మిగల్చగలిగితే.. వరదలు వచ్చినప్పుడు దిగువనున్న మన రాష్ట్రం బాధపడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి ఏటా వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే కనీస ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని విమర్శించారు.

అంతేకాకుండా, ప్రతి సంవత్సరం వరదలు రావడం.. అధికారులు ఇక్కడికి వచ్చి శిబిరాలు ఏర్పాటు చేయడం.. కొద్దిరోజుల తర్వాత వాటిని ఎత్తివేయడం... ప్రతి ఏటా ఇదే తంతు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? ప్రతి ఏటా ఇలా వరదలు రావడానికి వర్షం, దేవుడు కారణం కాదు. దానికి కారణం పూర్తిగా మనిషే... అధికారులే అని జగన్ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu