జగన్కు కౌంటర్గా టీడీపీ ప్లాన్: తురుపు ముక్క పవన్
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సేకరణ బాధిత గ్రామాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి అమరావతి రైతుల సమస్యను ఎత్తిచూపుతూ రాజధాని ప్రాంత
Publish Date: Thu, 19 Jan 2017 (08:14 IST)
Updated Date: Thu, 19 Jan 2017 (08:20 IST)
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సేకరణ బాధిత గ్రామాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి అమరావతి రైతుల సమస్యను ఎత్తిచూపుతూ రాజధాని ప్రాంతంలో ప్రత్యక్షమైపోయాడు. బుధవారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయని పాలెం, లింగాయ పాలెం గ్రామాలకు చెందిన రైతులు భారీ స్థాయిలో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు.
ప్రభుత్వం ముందుగా వాగ్దానం చేసినట్లుగా తమకు పునరావాస చర్యలు, సహాయాన్ని అందించలేదని, తమకు న్యాయం జరగలేదని రాజధాని ప్రాంత రైతులు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం తమపట్ల పక్షపాత దృష్టితో చూస్తోందని ప్రజలు పవన్కు చెప్పుకుని విలపించారు.
అదేసమయంలో పోలవరం మండలంలోని మూల లంక గ్రామ రైతులు కూడా బుధవారం పవన్ని కలిసి బాధలు చెప్పుకున్నారు. పోలవరం డ్యామ్ నుంచి మట్టిని డంప్ చేయడానికి ప్రభుత్వం తమనుంచి భూమిని బలవంతంగా లాక్కుందని వీరు ఆరోపించారు. రైతుల బాధ విని కదిలిపోయిన పవన్ తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
మీ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళతాను వారు సరిగా స్పందించకపోతే, క్షేత్రస్థాయిలో ఆందోళన చేపడతాను. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సమస్య ఏమిటో నాకు తెలీదు అన్నాడు పవన్.
ప్రస్తుతం దావోస్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగ రాగానే పవన్ సూచనలను పాటించడం కచ్చితమే అంటున్నారు పరిశీలకులు. గురువారం రాజధాని ప్రాంతాన్ని సందర్శిస్తున్న వైఎస్ జగన్ని తటస్థపర్చడానికి ఇది ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయత్నం అని చెప్పనక్కర లేదు కదా.