విమాన ప్రయాణీకులకు శుభవార్త... ఇకపై తొందర్లో విమానాల్లో మీరు మొబైల్ ఫోన్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను వినియోగంచుకోవచ్చు. అంతేనా... ఇంకా లైవ్టీవీని కూడా చూడొచ్చు. దీనికోసం ఇప్పటికే హాంగ్కాంగ్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ విమాన సంస్థ "కాతే పసిఫిక్" కసరత్తు చేపట్టింది.
ఇందుకు గానూ విమానాల్లో వినోదాత్మక సౌకర్యాన్ని కల్పించే సంస్థ "ప్యానసోనిక్ ఏవియోనిక్స్" సంస్థతో కాతే పసిఫిక్ ఒప్పందం కుదుర్చుకోనుంది. 2012 సంవత్సరం తొలినాళ్లకంతా విమానాల్లో 50 మెగాబైట్ల సామర్ధ్యంతో పనిచేసే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను, అలాగే మొబైల్ ఫోన్ సర్వీసులను ఈ సంస్థ కల్పించనుంది.
ప్రతి ప్రయాణికుడు తన వద్ద ఉన్న పరికరాల (ల్యాప్టాప్, మొబైల్ ఫోన్)తో ఈ సదుపాయాన్ని ఆనందించవచ్చు. ప్రయాణికుల వెనుక బాగాన ఉన్న సీట్లకు ఓ తెర (స్క్రీన్) అమర్చబడి ఉంటుంది. ఇది ఎప్పటిక్పపుడు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేస్తుంది. ఇందులో కొన్ని ప్రత్యక్ష టీవీ కార్యక్రమాల్ని పే-పర్-వ్యూ పద్దతిలో వీక్షించవచ్చు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంటర్నెట్ కేవలం వాణిజ్యపరంగానే కాకుండా.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సేవలు ప్రయాణికులను ఎంతగానో ఆనందిపచేస్తాయని కాతే పసిఫిక్ అధికారి అలెక్స్ మెక్గొవాన్ తెలిపారు.
కానీ.... ఈ సేవలు ఉచితం కాదండోయ్...! మరి ఇన్ని సదుపాయాలు కల్పించినపుడు ఎంతో కొంత మూల్యం చెల్లించకోవాలిగా...! అయితే ఎంత ధర అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఒకసారి ఈ సరంజమా అంతా తయారయ్యాక విమానయాన సంస్థ ధరలను నిర్ణయిస్తుంది. ఇకపోతే చివరిగా విమానాల్లో బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించడంలో కాతే మొదటిది కావడం కొసమెరుపు.