బంగారపు గనుల వంటి అవకాశాలు త్వరలోనే రానున్నాయి రానున్నాయి. కాకాపోతే.. వీటిని చాకచక్యంగా ఎగరేసుకుపోవడమే ఇక మిగిలుంది. ప్రభుత్వంతో కలిసి భారత రక్షణ శాఖ.. ఆ విభాగానికి చెందిన ఆసుపత్రులను ఆధునికీకరించేందుకు బిడ్లను ఆహ్వానించడం ప్రారంభించింది. అదీ సాదా సీదాగా కాదు.. భారీ స్థాయిలో ఈ మార్పులు చేసేందుకు రక్షణ శాఖ సంకల్పించినట్లు సమాచారం.
దీంతో కాంట్రాక్ట్ కూడా భారీగా ఉంటుందన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. ఇంకేం.. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో అష్టకష్టాలు పడుతున్న ఐటీ సంస్థలకు కొంత స్వాంతన లభించనుంది. అందుకే ఐటీ దిగ్గజాలు ఈ కాంట్రాక్టులపై కన్నేశాయి. సుమారు రూ. 5వేల కోట్లకు పైగా ఈ కాంట్రాక్ట్లు ఉండటంతో ఎలాగైనా ఇంత భారీ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్, హెచ్పీ, ఐబీఎం, ఎస్ఏపీ, పెరోట్ సిస్టమ్, జీఈ హెల్త్కేర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ కాంట్రాక్టులను చేజిక్కించుకునేందుకు చూస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో.. ఇ- సిస్టమ్స్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే.. భారత్ ప్రభుత్వంతో కలిసి రక్షణ రంగం ఆ దిశగా ప్రణాళిక చేసినట్లు తెలిసింది.
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇ- సిస్టమ్స్ ఏర్పాటు చేయడంపై ఆసక్తిని కబరుస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలో బిడ్కు ఆహ్వానం కూడా పంపే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా భారతీయ రైల్వేస్, ఐఏఎఫ్, భారత నావికా దళం మరియు ఆర్మీలు కూడా ఇదే బాటలో.. అంటే ఇ- సిస్టమ్స్ను అప్గ్రేడింగ్ చేసే ప్రక్రియలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే విప్రో ఇన్ఫోటెక్ కంపెనీ.. ఆసుపత్రి రోగుల పరిపాలన విభాగంలో టెక్నాలజీని అప్గ్రేడ్ చేసేందుకు భారత నావికాదళానికి చెందిన ఇ- హెల్త్ కాంట్రాక్టును కైవసే చేసుకుంది. విప్రో ఇన్ఫోటెక్ హెల్త్కేర్ ఐటీ జనరల్ మేనేజర్ హర్బీర్ సింగ్ సానే మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాము భారీ స్థాయిలో అవకాశాలను చూస్తున్నామన్నారు.
ఇప్పటికే విప్రో హెచ్సీఐటీ (హెల్త్ కేర్ ఐటీ) ప్రతి ఏడాది అంతకుఅంత వృద్ధి చెందుతోందన్నారు. పరిశోధన సంస్థ ఫ్రాస్ట్ అండ్ సలైవన్లో ఐటీ హెల్త్కేర్ ప్రోగ్రామ్ మేనేజర్ మరియు హెల్త్కేర్ డెలివరీ ప్రాక్టీసులో నిపుణులు అనురాగ్ దూబై మాట్లాడుతూ.. అత్యధిక ఇ- హెల్త్ ప్రాజెక్టులకు ఆస్కారముందన్నారు.
దీనికి సంబంధించి అప్లికేషన్లను అందించడానికి, నిర్వహించడానికి, నెట్వర్కింట్ వంటి వాటి కోసం భారతీయ ఐటీ కంపెనీలకు హెల్త్ కేర్ రంగంలో మెండుగా అవకాశాలున్నాయన్నారు. ఈ ఇ- హెల్త్ కేర్ ప్రాజెక్టుల వల్ల.. ఒక్క సారి రోగుల వివరాలు ఆసుపత్రుల డేటాబేస్లోకి ఎక్కిన తర్వాత దేశంలోని ఏ క్లినిక్లోనైనా మళ్లీ కొత్తగా డేటా ఎంటర్ చేసే అవసరం లేకుండా చికిత్స పొందేందుకు ఆ రోగికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.