దేశీయ ఐటీ కంపెనీలు డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను సాధించడంతో ఐటీ రంగం ఆర్థిక మాంద్యం నుంచి బయట పడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఓ వైపు పెరుగుతున్న డిమాండ్, మరోవైపు కొత్త కొత్త డీల్స్ వస్తున్న నేపథ్యంలో దేశీయ ఐటీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఐటీ రంగాలకు చెందిన పలు కంపెనీలు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడినట్లేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విదేశాలకు అత్యధిక స్థాయిలో సాఫ్ట్వేర్ సేవలను అందిస్తున్న టాటా సంస్థలకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలను సాధించినట్లు టీసీఎస్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
బ్రిటన్, యూరోపీయ సంస్థలలోను తమ సంస్థ కొత్తగా పెట్టుబడులను పెట్టనుంది. ఆఫ్షోర్ మార్కెట్లో ప్రధానమైన యూఎస్ నుంచి ఔట్ సోర్సింగ్ సేవలకు మంచి డిమాండ్ పెరుగుతోందన్నారు. తమ సంస్థ తృతీయ త్రైమాసికంలో 33 శాతం వృద్ధి సాధించి 1,823.90 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని ఆయన తెలిపారు.
అలాగే ఐటీ రంగంలో మరో దిగ్గజమైన ఇన్ఫోసిస్ సంస్థ పూర్తి సంవత్సరానికి ఆదాయ అంచనాలను పెంచుకుందని, తమ సంస్థకు చెందిన తృతీయ త్రైమాసిక ఫలితాలను చూసిన మీదట మాంద్యం నుంచి బయటపడుతున్నట్లు అనిపించిందని ఇన్ఫోసిస్ సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ) క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు.
ఈ దిశలో భాగంగా అటు యూకే, యూరప్, ఇటి ఆసియా, పసిఫిక్ దేశాల సంస్థలూ పెట్టుబడులను పెంచనున్నాయి. దీంతో ఎనర్జీ, యుటిలిటీస్, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక రంగం, బీమా తదితర రంగాలలో ఐటీ సేవలకు మంచి డిమాండ్ ఏర్పడనుందని, దీంతో ఐటీ రంగం రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమమైన ఫలితాలను సాధించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.