స్పామ్ పేరుతో మీ ఇన్బాక్స్కు చేరే చెత్త ఈ-మెయిల్స్తో ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఇలాంటి మెయిల్స్లోనే ఉగ్రవాదులు వారి సహచరులకు కోడ్ భాషలో రహస్య సమాచారాన్ని పంపుతుండవచ్చు. అందుకని మీ ఇన్బాక్స్ను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.
ఉగ్రవాదులు ఇంటర్నెట్ లాంటి అధునాతన పరిజ్ఞానాన్ని ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుమునుపైతే వీరు కోడ్ భాషలో ఉండే ఈ-మెయిల్స్ ద్వారా సమాచారాన్ని వారి సహచరులకు చేరవేసేవారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఉగ్రవాద నిరోధక బృందాలు వాటిని ట్రేస్ చేయగలిగేవి. ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు, ఎవరికి మెయిల్ పంపారో గుర్తించి, వారు ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టే వీలుండేది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదులు తెలివిమీరిపోయారు.
అందుకనే... "ఈ-మెయిల్ ఒక్కరికి పంపితేనే కదా మనకు సమస్య... అందుకే తమ సహచరులతో పాటు వేలు, లక్షల మందికి ఈ-మెయిల్స్ను పంపితే, మనల్ని ఎవరూ గుర్తించలేరు" అని నిర్ణయించుకున్న ఉగ్రవాదులు ఒకేసారి కొన్న లక్షల మంది స్పామ్ మెయిళ్లను పంపేస్తున్నారు. ఇలా లక్షల సంఖ్యలో స్పామ్ మెయిళ్లను చేరేవేసే సాఫ్ట్వేర్లు, వెబ్సైట్లు లెక్కకుమించి ఉండటంతో వీరి పని మరీ సులువై పోయింది.
ఇలా స్పామ్ మెయిళ్లను పంపడం వల్ల ఆ మెయిళ్లను ట్రేస్ చేసినప్పటికీ, ఎవరికి ఎవరు పంపారో గుర్తించలేక ఇంటెలిజెన్స్ వాళ్లు తలపీక్కోవాల్సి వస్తుంది. స్పామ్ సమస్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోవడం వెనుకనున్న అసలు కారణం ఇదే అయి ఉండవచ్చునని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ విషయమై కేంద్ర మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న యాంటీ స్పామ్ సాఫ్ట్వేర్ల వల్ల 99 శాతం నెటిజన్ల ఇన్బాక్స్లకు స్పామ్ మెయిళ్లు చేరలేవని అన్నారు. ఒకవేళ చేరినప్పటికీ కనీసం ఓపెన్ చేసి చదవకుండానే దాదాపు అందరూ వాటిని తీసిపారేస్తారు. ఒకరిద్దరు చదవాలని చూసినా, సంకేత భాషలో ఉండటం వల్ల వారికేమీ అర్థం కాదు. అందుకే అన్ని విధాలుగా ఇది సురక్షిత మార్గమని తలచిన ఉగ్రవాదులు దీన్ని ఎంచుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ స్పామ్ మెయిళ్ల ద్వారా కేవలం మెయిల్స్ మాత్రమే కాకుండా... మల్టీ మీడియా ఫైల్స్, వీడియో, ఆడియో ఫైల్స్ ద్వారా కూడా ఎన్క్రిప్టెడ్ సందేశాలను కూడా పంపించేందుకు వీలవుతుంది. కాబట్టి నెటిజన్లూ.. స్పామ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి సుమీ..!