సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సింహాసనంపై తెలుగుతేజం!
, గురువారం, 6 ఫిబ్రవరి 2014 (20:19 IST)
తెలుగు బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దిగ్గజ సాఫ్ట్వేర్ రారాజు మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవి తెలుగు తేజం సత్య నాదెళ్లను వరించింది. ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ స్థానే నాదెళ్ల కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మైక్రోసాఫ్ట్తో నాదెళ్ల అనుబంధం దశాబ్దాలనాటిది. వైస్ ప్రెసిడెంట్గా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ను క్లయింట్ సర్వీసెస్ నుంచి క్లౌడ్ సర్వీసెస్ వైపు దిగ్విజయంగా మళ్లించారు. మంచితనంతో పాటు.. చిత్తశుద్ధి, అంకిత భావానికి మారుపేరుగా నిలిచి.. పని తప్ప మరో ఆలోచన లేని పనిమంతుడు. భవిష్యత్ గురించి స్పష్టమైన ఆలోచనలు గల వ్యక్తి అనే పేరును మైక్రోసాఫ్ట్లో సత్య సంపాదించుకున్నారు. అందుకే కొత్త సీఈఓగా సత్య నాదెళ్లను ఎంపిక చేశారు. ఈయన సంస్థకు మంచి పేరు తెస్తారని అందరూ విశ్వసిస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య నాదెళ్ల మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో ఈబీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో ఎం.ఎస్, ఆ తర్వాత షికాగో యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. 1992 నుంచి సత్య మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు. నిజానికి మైక్రోసాఫ్ట్ దిగ్గజం విండోస్ కంప్యూటర్స్లో తనకంటూ తిరుగులేని స్థానాన్ని ఎప్పుడో చేజిక్కించుకుంది. అయితే, ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంది. మైక్రోసాఫ్ట్కి, నోకియాకి మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం కుదిరేలోగా, కొత్త సీఈఏ పేరును ఖరారు చేయాలని తొలుత భావించారు. అయితే ఈ పదవికి అనేక మంది పోటీ పడ్డారు. దీంతో వారందరి సామర్థ్యం గురించి చాలా చర్చలు జరిగాయి. చివరకు మరో నెల రోజులు గడిచిపోయాయి. మైక్రోసాఫ్ట్లో మంచి పేరున్న సత్యను ఎట్టకేలకు ఈ పదవి వరించింది. కాగా, సత్య నాదెళ్ల తండ్రి పేరు బీఎన్.యుగంధర్ ఐఏఎస్ అధికారి. లోగడ ఈయన ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగానూ, భారత ప్రణాళికా సంఘంలో కీలకమైన సభ్యుడుగానూ, ఇతర హోదాల్లోనూ పని చేసి జాతీయ స్థాయిలో మంచి పేరుగడించారు. అంతేకాకుండా, ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ అల్లుడు కూడా. పలు సందర్భాల్లో తండ్రితో కలిసి స్వగ్రామాన్ని కూడా సత్య నాదెళ్ల సందర్శించారు. సొంత గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడంలోనూ కీలక పాత్ర పోషించారు.