జియో రాకతో టెలికాం సంస్థల మధ్య వార్: ఎయిర్టెల్పై జియో విమర్శలు.. కస్టమర్లకు చుక్కలు?
జియో రాకతో టెలికాం సంస్థల మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎయిర్టెల్-రిలయన్స్ జియో మధ్య నువ్వా నేనా అంటూ వార్ జరుగుతోంది. ఇస్తామన్న ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) కూడా ఇవ్వకుండా ఎయిర్టెల్
జియో రాకతో టెలికాం సంస్థల మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎయిర్టెల్-రిలయన్స్ జియో మధ్య నువ్వా నేనా అంటూ వార్ జరుగుతోంది. ఇస్తామన్న ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) కూడా ఇవ్వకుండా ఎయిర్టెల్ మోసం చేసిందని రిలయన్స్ జియో ఆరోపించింది. నంబర్ పోర్టబులిటీ కింద ఎయిర్టెల్ నుంచి రిలయన్స్ జియో నెట్వర్క్కు మారే కస్టమర్లను ఎయిర్టెల్ ముప్పు తిప్పలు పెడుతోందని జియో విమర్శించింది.
ఫలితంగా తమ నెట్వర్క్లో రోజూ రెండు కోట్లకు పైగా కాల్ డ్రాప్స్ నమోదవుతున్నట్టు జియో పేర్కొంది. కాంట్రాక్ట్ టైమ్ కంటే ముందుగానే రిలయన్స్ జియో కోసం మరిన్ని పిఒఐలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించిన రెండో రోజే రిలయన్స్ జియో ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
అంతేగాకుండా వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ట్రాయ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జియో ఒక ప్రకటనలో కోరింది. తమ రెండు నెట్వర్క్ల మధ్య కాల్స్ పూర్తయ్యేందుకు అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్లో నాలుగో వంతు మాత్రమే ప్రస్తుతం ఎయిర్టెల్ తమ నెట్వర్క్ కోసం ఇచ్చిందని తెలిపింది.
ప్రస్తుతం మార్కెట్లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీని నీరుగార్చేలా ఎయిర్టెల్ ప్రవర్తిస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. దీనివల్ల జియో ఖాతాదారులు ఉచితంగా నాణ్యమైన వాయిస్ సేవలు అందుకోవడం సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఎయిర్టెల్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. జియో అవసరాల కంటే ఎక్కువ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లే ఇచ్చామని తెలిపింది.