Publish Date: Sat, 02 Mar 2019 (17:11 IST)
Updated Date: Sat, 02 Mar 2019 (18:27 IST)
నేటి తరుణంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ వాట్సాప్ వాడకం ఎక్కువైపోతుంది. రోజూ తింటున్నారో లేదో కానీ వాట్సాప్ మాత్రం తప్పకుండా వాడుతుంటారు. కొన్ని అవసరాలకు వాట్సాప్ ఉపయోగపడినా ఒక్కోసారి చెడు కూడా చేస్తుంది. అలాంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఎవరో ఒకతను వాట్సాప్ గ్రూప్లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు గ్రూప్ అడ్మిన్తో పాటూ, పోస్ట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జొమాటోలో డెలివరీ బోయ్గా పనిచేస్తున్న వెంకటేష అనే వ్యక్తి లాయల్ పార్ట్నర్స్ ఎమర్జెన్సీ అనే ఓ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశాడు. ఫిబ్రవరి 26వ తేదీన గ్రూప్ సభ్యుడైన మొహమ్మద్ మునీర్ జాతీయ జెండా తగలబెడుతున్న ఫోటోను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన అదే గ్రూప్కు చెందిన వెంకట రామ రెడ్డి అనే వ్యక్తి మల్కాజ్గిరి పోలీసులకు దీని గురించి ఫిర్యాదు చేశాడు.
ఇక పోలీసులు.. గ్రూప్ అడ్మిన్ వెంకటేష్, మెసేజ్ పోస్ట్ చేసిన వ్యక్తి మొహమ్మద్ మునీర్పై కేసు నమోదు చేశారు. రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.