ముస్లింల పవిత్రమాసం మాహే రంజాన్
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓ పండుగ వాతావరణంలా జరుపుకునే అత్యంత పవిత్రమాసం రంజాన్. ఇది చాంద్రమానం ప్రకారం తొమ్మిదవ నెలగా రంజాన్ నెల వస్తుంది. ఆకాశంలో నెలవంక కనిపించిన రోజున రాత్రి ఇషా నమాజుతోపాటు తరావీహ్ నమాజును చదువుతారు. మరుసటి రోజు ఉదయాత్పూర్వం నుండి రంజాన్ మాసపు ఉపవాస (రోజా) దీక్షలు ప్రారంభిస్తారు. ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ముస్లీం సోదరులు వయో, లింగ భేదం లేకుండా పాటించే కఠోర ఉపవాస దీక్షల వెనుక భక్తితోపాటు ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. ఉదయాత్పూర్వం భుజించి ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. దీనినే సహరీ అంటారు. ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్తో దీక్షను విరమిస్తారు. దీక్షా సమయంలో కఠోర నియమాలను పాటిస్తూ...ప్రతి రోజు ఐదు సార్లు నమాజ్ చేయాలి. అలాగే ప్రతి క్షణం ఆ దేవదేవుడైన అల్లాహ్ను స్మరిస్తూ తమ దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమౌతారు. ఇలా నెల రోజుల పాటు కొనసాగే ఈ ఉపవాస (రోజా) దీక్షా సమయంలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. కారణం లేకుండా ఈ మాసంలో రోజాలు పాటించకపోతే తరువాత లక్ష రోజాలు పాటించినా ఈ ఒక్క రోజాకు ప్రతామ్నాయం కాలేదని ముస్లిం మత గ్రంథాలలో (హదీసులలో) రాసి ఉందని మత పెద్దలు చెబుతుంటారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ‘పవిత్ర ఖురాన్’ రంజాన్ మాసంలోనే ప్రవక్త హజ్రత్ ముహ్మద్ (సొఅస) ద్వారా ఆవిర్భవించిందని ప్రగాఢ విశ్వాసం. అన్నిటికంటే ప్రాధాన్యతనిచ్చే ‘ఖురాన్’ బోధనలను ఈ మాసంలో తప్పకుండా పాటిస్తారు. ఇస్లాం సూత్రాలలో ప్రధానంగా ఐదు సూత్రాలను తప్పక పాటించాలి. వాటిలో ఉపవాస దీక్ష (రోజా), నమాజ్, జకాత్లు ఆచరించే అవకాశం రంజాన్ మాసంలోనే ప్రాప్తిస్తున్నందున ముస్లింలు ఈ రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. రంజాన్ మాసంలో ఐదుపూటలా చేసే నమాజులతోపాటు రంజాన్ మాసంలో వచ్చే ప్రత్యేక ప్రార్థన 'తరావీహ్’నమాజ్ సైతం ఆచరిస్తారు. అంతే కాకుండా చాలామంది 'ఇత్తెకాఫ్’పేరిట అన్ని కార్యక్రమాలను విడిచిపెట్టి మసీదుల్లోనే ప్రార్థనల్లో నిమగ్నమవుతుంటారు. ఇందులో ముఖ్యంగా చివరిగా రాత్రిపూట చేసే నమాజు (ఇషానమాజు) తర్వాత అదనంగా 20 రకాతుల నమాజు చేస్తారు. ఈ నమాజు చంద్రుడు కనిపించిన రాత్రికి ప్రారంభించి పండుగకు ఒక్కరోజు ముందు మళ్లీ చంద్రుడు కనిపించిన రోజు వరకు కొనసాగిస్తారు.
ముఫై రోజుల వరకు కొనసాగే ఈ నమాజు చదివించే ఇమాం ఖురాన్లోని సూరాలను నమాజులో వినిపిస్తారు. రంజాన్ మాసంలోని 30 రోజుల్లో అత్యంత ప్రధానమైనది 26వ రోజు రాత్రి. దీనినే ముస్లింలు సతావీహ్ కీ రాత్ అంటారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఈ రోజునే అవతరించిందని ముస్లింలు ప్రగాఢ విశ్వాసం. ఈ 26వ రోజు రాత్రిని షబ్-ఎ-ఖదర్గా పిలుస్తారు. షబ్-ఎ-ఖదర్ రాత్రి ముస్లింలందరూ జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ రాత్రి భక్తి శ్రద్దలతో ప్రార్థనలు జరిపితే వారు గతంలో చేసిన పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. భక్తితో కఠోర దీక్షతో ప్రార్థనలు చేసేవారికి 84 సంవ త్సరాలు (1001నెలలు) ప్రార్థనలు చేసి న దానికి సమానమైన పుణ్యం లభి స్తుందని నమ్ముతారు. రంజాన్ మాసంలో వచ్చే చివరి శుక్రవారాన్ని జుమాతుల్ విదాగా పిలుస్తా రు. అంటే రంజాన్ నెల ముగుస్తుందని అర్థం. ఈ జుమా నమాజ్లో చాలా సంఖ్యలో ముస్లింలు మసీదులలో చేరుకుని ప్రార్థనలు జరుపుతారు. అరబ్బిలో ‘అల్విదా’ అంటే 'వీడ్కో లు’ అని అర్థం. జుమా అంటే శుక్రవారం. అందుచే దీనిని ‘జుమాతుల్విదా’ అంటారు.
నెల రోజులపాటు జరిగే ఈ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లింలు తమ సంపాదనలో విధిగా ‘జకాత్’ (తమ ఆస్థిలో కొంత మొత్తాన్ని పేదలకు పంచిపెట్టడం) ఆచరించాలని పవిత్ర ఖురాన్ బోధిస్తుంది. ఖురాన్ బోధనల ప్రకారం ముస్లింలు రంజాన్ మాసంలో దానధర్మాలు చేస్తుంటారు. క్రమశిక్షణకు, ఓర్పుకు, సహనానికి మారు పేరైన ఇస్లాం మతంలోని ముస్లింలకు ఈనెలలో ఆ లక్షణాలు అద్దంపట్టేట్లు కనిపిస్తాయి. దీక్ష విరమణ తరువాత ఆహారపదార్థాలు ఏవి తిన్నా దీక్ష మాత్రం ఖర్జూరం (ఖజూర్)తో విరమించడం సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఇస్లాం మత ప్రవక్త ముహ్మద్ కాలంనాటి నుండి వస్తున్నదని ముస్లింలు పేర్కొంటారు. చంద్రుడు కనిపించగానే అరబిక్ మాసం షవ్వాల్ ఒకటో తేదీన రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.