ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో భాగంగా గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ లయన్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపును నమోదు చేసుకుని ఫైనల్లోకి దూసుకెళ్లింది. డేవిడ్ వార్నర్ అద్భుత బ్యాటింగ్తో సన్రైజర్స్ని ఫైనల్లోకి చేర్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది.
గుజరాత్ ఆటగాళ్లలో ద్వివేదీ (5), రైనా (1) వికెట్లను తొందరగా కోల్పోయినా.. మెక్ కల్లమ్ (32), దినేష్ కార్తిక్ (26) రాణించడంతో గుజరాత్ కోలుకుంది. తరువాత డ్వేన్ స్మిత్(1) నిరాశపరిచినా.. ఫించ్ (50) అద్భుత ఇన్నింగ్స్తో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అనంతరం బరిలోకి దిగిన బ్రావో (20), రవీంద్ర జడేజా (19)లు ఫించ్కు తోడుకావడంతో 162 పరుగులు సాధించింది. తదనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. డేవిడ్ వార్నర్ అద్భుత బ్యాటింగ్తో అలరించాడు. ఓపెనర్గా క్రీజులోకి దిగిన వార్నర్.. 96 పరుగులతో నాటౌట్గా నిలిచి సన్ రైజర్స్ని ఫైనల్కి చేర్చాడు.
శిఖర్ ధావన్ (0), యువరాజ్ సింగ్ (8), కటింగ్ (8) వరుసపెట్టి పెవిలియన్ చేరుకున్నప్పటికీ.. వార్నర్ మాత్రం పట్టు విడవకుండా సన్రైజర్స్కి భారీ విజయాన్ని సాధించిపెట్టాడు. డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. దీంతో ఆదివారం బెంగళూరుతో సన్రైజర్స్ ఫైనల్ పోరుకు సన్నద్ధమైంది.