Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌ నడ్డి విరిచి ఎట్టకేలకు గెలిచిన సీఎస్కే: ఊపిరి పీల్చుకున్న ధోనీ

హైదరాబాద్‌ నడ్డి విరిచి ఎట్టకేలకు గెలిచిన సీఎస్కే: ఊపిరి పీల్చుకున్న ధోనీ
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (23:46 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. దీంతో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆటగాళ్ళకి ఆరంభం అంతగా కలిసిరాలేదు. 
 
కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్పుడు కేన్ విలియమ్సన్ ఆట భారాన్నంతా తన మీద వేసుకున్నాడు. కానీ కొద్ది సేపటికే బైర్ స్ట్రో పెవిలియన్ బాట పట్టాడు.
 
బైర్ స్ట్రో 23పరుగులు (24బంతుల్లో 2ఫోర్లు) చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియమ్, గార్గ్, విజయ్ శంకర్ నిలబడలేకపోయారు. ప్రియమ్ గార్గ్ 18 బంతుల్లో ఒక ఫోరుతో 16పరుగులు చేయగా, విజయ్ శంకర్ ఏడు బంతుల్లో ఒక సిక్సర్‌తో 12పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టుని విజయ తీరాలకి చేర్చే ఒకే ఒక్కడు ఉన్నాడని అనుకుంటుండగా కేన్ విలియమ్సన్ కూడా ఔటయ్యాడు. మొత్తం 39బంతులాడిన విలియమ్సన్ ఏడు ఫోర్లతో 57పరుగులు చేసాడు.
 
ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ 14పరుగులు చేయగా మిగతా వారు పెద్దగా ఆడలేదు. మొత్తానికి 147పరుగులకి 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని చెన్నై ఖాతాలో జమ చేసారు. చెన్నై బౌలర్లలో కరన్ శర్మ, డ్వేన్ బ్రావో తలా రెండు వికెట్లు, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.
 
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సామ్‌ కరాన్‌ (31), షేన్‌ వాట్సన్‌(42), అంబటి రాయుడు(41)లు రాణించడంతో చెన్నై స్కోరు బోర్డు మంచి స్కోరును నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డుప్లెసిస్‌ ఆడిన తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌తో కలిసి సామ్‌ కరాన్‌ ఆరంభించాడు. అయితే డుప్లెసిస్‌ గోల్డెన్‌ డక్‌ కావడంతో వాట్సన్‌ ఫస్ట్‌ డౌన్‌ వచ్చాడు. కరాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 
 
కాగా, సీఎస్‌కే స్కోరు 35 పరుగుల వద్ద కరాన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వాట్సన్‌-అంబటి రాయుడులు ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. భారీ షాట్లతో అలరించాడు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత రాయుడు భారీ షాట్‌ ఆడబోయి వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఫుల్‌టాస్‌ బాల్‌కు రాయుడు వికెట్‌ సమర్పించుకున్నాడు. 
 
కాసేపటికి వాట్సన్‌ కూడా అదే తరహాలో పెవిలియన్‌ చేరాడు. నటరాజన్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతికి షాట్‌ ఆడబోయిన వాట్సన్‌..మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చాడు. చివర్లో ధోని (21; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), జడేజా(25 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)లు ఆకట్టుకుని గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఫలితంగా ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.
 
గెలవాలనే కసితో బరిలోకి దిగిన ధోనీ సేన బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్‌లో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్