నటుడిగా 'పందెంకోడి'తో తెలుగులో కథానాయకుడిగా పరిచయమైన విశాల్... పదేళ్ళయినా అదే పేరుతో తనను గుర్తిస్తున్నారని.. ఆ చిత్రం అంతగా ప్రేక్షకుల్లోకి వెళ్ళిందని అంటున్నాడు. నటుడిగానే కాక నిర్మాతగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పలు చిత్రాలు తీస్తున్న అతను ఇటీవలే నటీనటుల సంఘం 'నడిగర్ సంఘం'లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో తాను తెలుగువాడిననీ.. చాలామంది అన్నారు. నటీనటులు తనకు సపోర్ట్ చేయడంతో.. గెలిచానని.. చెబుతున్న విశాల్.. తాజాగా ఆయన తమిళంలో నటించిన 'మరుధం' చిత్రం తెలుగులో 'రాయుడు'గా రాబోతుంది. తమిళంలో ఈ నెల 20న విడుదలవుతుండగా.. 27న తెలుగులో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా విశాల్తో ఇంటర్వ్యూ..
తెలుగులో ఆలస్యంగా వస్తున్నాయి మీ సినిమాలు?
కొన్నిసార్లు ఒకేసారి కుదరవు. అక్కడ కరెక్ట్ టైమ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక్కడ కుదరదు. నాకు తెలుగు మార్కెట్ బోనసే.
'రాయుడు' కథేమిటి?
రాయుడు చాలా మాస్ చిత్రం. మదురైలోని రాజపాళ్యం అనే టౌన్లో చిత్రీకరించాం. దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు రెండు సినిమాలు చేశారు. ఆ కథలను కూడా నాకు చెప్పారు. నాతో సినిమా చేయాలన్నది ఆయనకున్న ఆశ. నన్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అలా తెరకెక్కించారు. మార్కెట్లో కూలీగా రాయుడు చేస్తుంటాడు. ఓ పొలీటీషన్ను.. తనకు వున్న గొడవే సినిమా.
ఇలాంటి చిత్రాలు చాలా వచ్చాయే?
అవును. ఇది పాత కథే అయినా.. ముత్తయ్య తరహాలో కొత్తగా వుంటుంది. పక్కామాస్ చిత్రమిది.
ట్రైలర్స్లో కండలు బాగా కన్పించాయి?
పాత్రలో చాలా జాగ్రత్తలు దర్శకుడు చెప్పారు. కండలు పెంచాను. గెడ్డం వుంది. లుక్తో పాటు టాటూ కూడా వేసుకున్నాను. ప్రత్యేకంగా ఇందులో యాక్షన్ సీన్స్ హైలైట్గా వుంటాయి. కండలు తిరిగిన మగాడు పది మందిని కొడితే ఎంత నేచురల్గా ఉంటుందో, అంత నేచురల్గా తెరకెక్కించాం. ఎక్కడా రోప్ వర్క్ వాడలేదు. కాస్త బరువు పెరిగాను. అనల్ అరసు నాతో ఫైట్స్ చేయించడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంతకు ముందు చేసింది వేరు, ఈ సారి అతను ఇష్టపడి చేసింది వేరు.
ఇమాన్ సంగీతం ఎలా వుంది?
ఇంతకు ముందు కూడా నేను ఇమాన్తో పనిచేశాను. ఆయన సంగీతం ఒకసారి ఏదో వినగానే నచ్చేసినట్టు, వదిలేసినట్టు ఉండదు. వినేకొద్దీ బావుంటుంది. ఐదేళ్ల తర్వాత విన్నా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇళయరాజా సార్ సంగీతంలో ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు నాకు ఇమాన్లోనూ ఆ గుణం కనిపిస్తోంది.
తదుపరి చిత్రాలేంటి?
శిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో తమన్నా, జగపతిబాబుగారు నటిస్తున్నారు. అక్టోబర్ 7న విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత మిష్కిన్ దర్శకత్వంలో జులై నుంచి ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత 'టెంపర్' రీమేక్ చేస్తా. బాలాగారితోనూ ఓ సినిమా ఉంటుంది.
తెలుగులో స్ట్రెయిట్ చిత్రాన్ని ఆమధ్య ప్రకటించారు?
అవును. ఆ దర్శకుడు నాకోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. సమయం చూసుకుని చేస్తాం.
నడిగర్ సంగంలో మీరు గెలిచాక వచ్చిన మార్పులేంటి?
నష్టాల్లో ఉన్న సంఘాన్ని ఇప్పుడు రూ.9 కోట్ల ప్రాఫిట్తో ఉంచాం. బిల్డింగ్ కడుతున్నాం.
చాలా గొడవల మధ్య ఎన్నికలు జరిగాయి. ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటారు?
30 ఏళ్ళు కుర్చీలో వుండి.. ఒకేసారి పదవి పోతుందంటే కొంచెం కష్టమే.. మేం చేయలేనిది మీరేం చేస్తారని ఎగతాళి చేశారు.. యూత్ తలచుకుంటే ఏదైనా చేయవచ్చని నిరూపించాం.
ప్రాంతీయమనే తేడా రాలేదా?
నేను తెలుగువాడినని అన్నారు. పేరు రెడ్డి వుందన్నారు.. ఇంకా చాలా అన్నారు. నల్లగా వున్నాడని మాత్రం అనలేదు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనిపించింది.
రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తున్నాయి. మీ ప్రమేయం వుందా?
లేదు. ఓటు ఎవరికి వేయాలో నిర్మొహమాటంగా వేయండి. ప్రతివారికి ఫ్రీడం. ఇదే మా సభ్యులు అన్ని చోట్ల చెప్పేది. అయితే.. ఏ పార్టీ తరపు నుంచి మాకు ప్రచారంకు ఆహ్వానించలేదు. వచ్చినా వెళ్ళేది లేదు.
పెళ్లి మండపం ఎంతవరకు వచ్చింది?
2018 జనవరి 14న ప్రారంభిస్తాం.
మరి పెళ్లెప్పుడు?
కళ్యాణమండపం అయ్యాకే.. జనవరి 15న అక్కడ జరిగే తొలి పెళ్లి నాదే అవుతుంది అన్నారు.