ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలనుకునేవారికి ఎవరో ఒకరు హీరోగా ఇన్స్పిరేషన్ వుంటారు. ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు చెబుతుంటారు. కానీ కథానాయకుడు నాగశౌర్య మాత్రం ఎన్టిఆర్ ఇన్స్పిరేషన్గా చెబుతున్నాడు. 'చందమామ కథలు'లో కార్పొరేషన్ కార్మికుడిగా నటించిన ఆయన ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే'లో సెకండ్ హీరోగా చేశాడు. తర్వాత 'దిక్కులు చూడకు రామయ్య'లో సోలో హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం లక్ష్మీరావే మా ఇంటికి చిత్రంలో చేశాడు. ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన చిట్చాట్.
నటుడిగా అవ్వాలనేందుకు ఇన్స్పిరేషన్ ఎవరు?
నాకు చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టం. దానికోసం కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. కానీ..నటుడిగా, స్పీకర్గా ఎన్టిఆర్ జూనియర్ నాకు ఇన్స్పిరేషన్. తక్కువ వయస్సులోనే ఆయన ఓసారి నిమ్మకూరులో ఆంధ్రావాలా ఫంక్షన్కు వెళితే... లక్షలాది మంది ఆయన స్పీచ్ కోసం వచ్చారు. 21 ఏళ్ళ వయస్సులోనే మైక్ ముందు ప్రజల మధ్య మాట్లాడటం మామూలు విషయంకాదు. ఆయన డైలాగ్ డిక్షన్, మాడ్యులేషన్, నటన నన్నెంతో ఆకట్టుకున్నాయి.
నాల్గవ సినిమా జర్నీ ఎలా అనిపిస్తుంది?
మొట్టమొదటి సినిమా 'చందమామ కథలు'. అందులో చిన్న వేషం. అయినా పేరు వచ్చింది. ఆ తర్వాత సెకండ్ హీరోగా, తర్వాత సోలో హీరోగా చేస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కాను. లక్ష్మీరావే.. చిత్రంతో మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాననే నమ్మకం వుంది.
అవికాగోర్తో నటించడం ఎలా అనిపిస్తుంది?
ఆమె నటిగా నా కంటే సీనియర్. జాతీయస్థాయిలో నటించింది. కానీ సినిమాల పరంగా నా కంటే జూనియర్. అయినా నటనలో ఆమె నుంచి చాలా నేర్చుకోవాల్సింది వుంది. చాలా నిరాడంబరంగా వుంటుంది. అందరితో కలిసి పోతుంది.
ఈ చిత్రం ఏవిధంగా తెరకెక్కింది?
'చందమామ కథలు', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రాల తర్వాత ఏ సినిమా చేయలనే ఆలోచనలో ఈ కథ నాముందుకు వచ్చింది. అసలు విషయం చెప్పాలంటే... ఊహలు.. సినిమాకు ముందే కథ చెప్పారు. అది కొద్దికాలం ఆగి, ఆగి మళ్ళీ నా వద్దకు రావడం చిత్రంగా అనిపించింది. ఈ చిత్రంలోని టెక్నీసియన్స్ అంతా ముందు కుదిరారు. ఆఖరున సెలక్ట్ అయింది నేనే. సాయి అనే పాత్ర నేను చేశాను. అల్లరిగా వుంటే బాధ్యతలు మీద పడితే ఎలా వుంటుందనేది పాత్ర స్వభావం. ఈ క్యారెక్టర్ నాకు చెప్పడానికి దర్శకుడు నందాల రవి చిత్ర యూనిట్ను అంతా సిద్ధం చేసుకుని ఆఖరిన నాకు వినిప్పించారు. మొదటి భాగం చెప్పగానే కుర్చీల్లోంచి లేచి ఎప్పుడు షూటింగ్కు వెళదాం అని నేనే అడిగాను.
ఎలాంటి కథ ఇది?
బొమ్మరిల్లు లాంటి ఇంట్లోకి ఇడియట్ వెళితే ఎలా వుంటుందనేది పాయింట్. కథంతా అవికాగోర్ చుట్టూనే తిరుగుతుంది. నేను ఆమె చుట్టూ తిరిగి.. మా ఇంటిరా! అంటూ అడిగేదే చిత్రం. కథతోపాటు కథనం, సంభాషణలు నంద్యాల రవి అద్భుతంగా రాశారు. రాధాకృష్ణ సంగీతం, తండ్రి, కుమార్తెల అనుబంధం చెప్పుకోదగినవిగా వుంటాయి.
ఈ ఏడాది మీకు ప్రత్యేకంగా అనిపిస్తుందా?
ఐదేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూసిన నాకు.. ఈ ఏడాది ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల కావడం ఆశ్చర్యంగా వుంది. వచ్చే ఏడాది ఎలా వుంటుందనే భయం కూడా వుంది.
కొత్త చిత్రాలు?
అలా మొదలైంది దర్శకురాలు నందినీరెడ్డి దర్శకత్వంలో ప్రేమకథ చేస్తున్నా. కొత్త దర్శకుడు సాయి దర్శకత్వంలోనూ, యోగి దర్శకత్వంలోని చిత్రాలు భిన్నమైనవిగా వుంటాయి.
మీ అభిమాన నటుడు?
నాగార్జున. అభిమానిగా ఆయనంటే ఇష్టం.
పెండ్లి ప్రయత్నాలు చేస్తున్నారా?
ఇప్పటికే ఇంటిలో తొందర పెడుతున్నారు. ఇండస్ట్రీలో గాసిప్స్ బాగా వుంటాయి. ఆ భయంతో తొందర పెడుతున్నారు. అయినా ఇప్పుడప్పుడే చేసుకోనని చెప్పాను.