ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పటివారికి ఏదో కావాలి. అది నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే నేను చేసే కొత్తచిత్రానికి దర్శకత్వం చేయను. ముందుకూడా చేస్తానని ఇప్పుడు చెప్పలేనని దాసరి నారాయణరావు అన్నారు. ఆయన పుట్టినరోజు ఈ రోజే. మే 4.. సోమవారం నాడు జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహం ఉదయం నుంచి.. సినీరంగ ప్రముఖులతో కార్మిక నాయకులతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్చాట్...
ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి?
ప్రతిసారి జరుపుకున్నట్లే... అభిమానులు, సినీరంగ ఆత్మీయులు మధ్య జరుపుకుంటున్నాను. నన్ను నమ్మిన రాజకీయనాయకులు కూడా నాకు విషెస్ చెప్పారు.
వివాదంలో వున్నారు కదా..?
ఇప్పుడు అవేమీ వద్దు... కేసు నడుస్తుంది చెప్పకూడదు.
పవన్ కళ్యాణ్ సినిమా లేదనీ, వుందని భిన్నవార్తలు వస్తున్నాయి?
నేను ఏవో స్టేట్మెంట్స్ ఇవ్వను. దాసరి, పవన్ కాంబినేషన్ తప్పకుండా వుంటుంది. మీరన్నట్లు... ఇదేదో దాసరి వ్యక్తిగతంగా ఆశించి చేస్తున్నట్లు చెవులు కొరుక్కుటున్నారు. పవన్ గొప్పతనం నాకు తెలుసు. ఆయన నెంబర్1లో వున్నాడు. ప్రజలకు చేరువయ్యాడు. ఆయన స్పీచ్.. వింటుంటే ఏదో సమాజానికి సేవ చేయాలనే ఇంట్రెస్ట్ వుంది. తానే .. మనం కలిసి సినిమా చేయాలని అడిగాడు. ఏదో సరదాగా అనుకున్నాను. కానీ ఆయన సీరియస్నెస్ చూసి ఆశ్చర్యమేసింది. చిన్నప్పటి నుంచి ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి మనిషి.
దర్శకత్వం వహిస్తారా?
ఆల్రెడీ... నేను చేయనని నిన్ననే ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. దానికి కారణం కూడా వుంది. నా నుంచి ప్రజలు ఏదో ఆశిస్తున్నారు. అది ఈనాటి ట్రెండ్కు నేను ఇవ్వలేకపోతున్నాను. నా ప్రేక్షకులు టీవీలకే పరిమితమయ్యారు. థియేటర్లకు రావడంలేదు. ఏజ్ గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం దర్శకత్వం చేసే ఆలోచన లేదు. నిర్మాతగా మంచి విలువలతో సినిమా చేస్తా.
ఇటీవలే 14మంది నిర్మాతలు బడ్జెట్ను కంట్రోల్ చేస్తామంటున్నారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా... మీరేం చేయగలరు?
ఇందులో ఒక్క విషయం స్పష్టంగా వుంది. హీరోలు వచ్చి మాతో సినిమా తీయమని చెప్పరు. నిర్మాతో అవసరం కనుక వారిచుట్టూ తిరుగుతున్నారు. అలాంటప్పుడు బడ్జెట్ కంట్రోల్ ఎలా అవుతుంది. చిన్న హీరోలతో అది సాధ్యం. ఏది ఏమైనా.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒకటి వుంది. దాని ఆధారంగా ఏదైనా చేయాలి. త్వరలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నా.
మేడే నాడు మీరుండగానే... మంత్రి తలసాని.... కొందరు పద్ధతులు మార్చుకోవాలంటూ... నిర్మాతల్ని హెచ్చరించారు.. ?
అవును. ఆయన దృష్టికి వచ్చిన మేరకు కొందరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. దానికి ఆయనే కరెక్ట్గా సమాధానం చెప్పగలరు.
మీ ఆధ్వర్యంలో గృహాల నిర్మాణం జరిగిన చిత్రపురిలో అందరికీ న్యాయం జరగలేదని కూడా విమర్శలు వస్తున్నాయి?
చిత్రపురి అనేది 24 క్రాఫ్ట్ సినిమా కార్మికుల గృహ సముదాయం. అందులో వున్నది అందరూ పనిచేసే కార్మికులే. ఇందులో ఎక్కడా మోసాలకు, తావులేదు. కొంతమంది డబ్బు కట్టనివారు వదులుకుంటే.. అవి ఖాళీగా వున్నాయి.
''మా'' ఎన్నికలు ఎంఎల్ఎ స్థాయిలో జరిగినట్లుంది?
మా ఎన్నికలు ఎప్పుడూ సామరస్యపూర్వకంగానే ఏకగ్రీవంగానే జరుగుతాయి. ఈసారి అలా జరిగింది. ఇలాంటివి ఏకగ్రీవమైతేనే బాగుంటుంది.
జీవితచరిత్ర రాస్తున్నారు?
అవును. నా కెరీర్లో చవిచూసిన సంఘటనలు, నిజాలు కలిపి రాయాలి. అబద్ధాలు రాయకూడదు. అందుకే నిజాయితీగా రాస్తున్నాను. త్వరలో అది బయటకు వస్తుందని అన్నారు.