గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న భారత్కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారిగా భారత్ విశ్వసిస్తున్న జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ కేసు విచారణను పాకిస్థాన్ సుప్రీంకోర్టు సోమవారం నిరవధిక వాయిదా వేసింది.
సయీద్పై నమోదయిన కేసులపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సయీద్ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు తాజాగా వాయిదా వేసింది. పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ రాజీనామా చేయడంతో సుప్రీంకోర్టు విచారణను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ సహా, పలువురు ప్రభుత్వాధికారులు జమాదుత్ దవా చీఫ్ సయీద్ను గృహ నిర్బంధంలో ఉంచేందుకు తమ వద్ద బలమైన ఆధారాలు లేవని చెబుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు విచారణను నిరవధిక వాయిదా వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సయీద్ ఇప్పుడు స్వేచ్ఛాజీవి అని అతని తరపు న్యాయవాది విలేకరులతో చెప్పారు. పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వ పిటిషన్తోపాటు, కేంద్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణను కూడా సుప్రీంకోర్టు నిరవధిక వాయిదా వేసినట్లు సయీద్ తరపు న్యాయవాది వెల్లడించారు. పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ రజా ఫరూఖ్ ఆదివారం రాజీనామా చేశారు. కొత్త న్యాయవాదిని నియమించేందుకు పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కొంత సమయం కోరింది. కేసుపై విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.