రజనీ సినిమాకు ఎల్టీటీఈ పెట్టుబడులు
ఎల్టీటీఈ తమిళ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టిందని, తమ డబ్బుతో తమిళ చిత్ర పరిశ్రమలోని రజనీకాంత్ వంటి అగ్రహీరోలతో సినీ నిర్మాణాలు చేపట్టిందని శ్రీలంక మంత్రి ఒకరు వ్యాఖ్యానించడంతో తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. లండన్లో నివాసముంటున్న ఓ తమిళ వ్యక్తి తమిళ చిత్ర నిర్మాణ రంగంలో ఎడాపెడా పెట్టుబడులు పెట్టాడని సమాచారం. ఈ తమిళ వ్యక్తికి ఎల్టీటీఈ మిలియన్లకొద్దీ అమెరికన్ డాలర్లను తరలించిందనీ, వాటినే అతను తమిళ సినీరంగంలో పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేశాడని శ్రీలంక మంత్రి ఒక వెబ్సైట్కిచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. రజనీకాంత్ చిత్రం "ఎందిరన్" (రోబో) చిత్రానికి కూడా సదరు వ్యక్తి పెట్టుబడులు పెట్టాడని ఆయన పేర్కొన్నారు. తమిళ సినీరంగంలో అగ్ర నటులతో చిత్రాలను చేయాలంటే కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి కనుక తమిళ సినీరంగంలోని కొందరు నిర్మాతలు పెట్టుబడులకోసం విదేశాలలో ఉన్న బడా వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే వారివద్ద నుంచి తెచ్చిన డబ్బుతో సినిమాలు నిర్మిస్తున్నట్లు మరో వాదన. కాగా ఈ అంశంపై రజనీకాంత్ కార్యాలయం స్పందించడానికి నిరాకరించింది. రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో చిత్రానికి సంబంధించిన పెట్టుబడి అటువంటి సంస్థల నుంచి తీసుకున్నట్లు వచ్చిన వార్తలను చిత్ర నిర్మాత కొట్టి పారేశారు. ఇది ఈ సంవత్సరంలో "ఓ పెద్ద జోకు"గా ఆయన అభివర్ణించారు.