తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ బతికే ఉన్నాడని ఆ తీవ్రవాద సంస్థ చేస్తున్న ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపు అధిపతి బైతుల్లా మెహసూద్ గత బుధవారం అమెరికా డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) జరిపిన క్షిపణి దాడిలో మృతి చెందాడని పాక్ అధికారిక వర్గాలు ధృవీకరించిన సంగతి తెలిసిందే.
అయితే అనంతరం తాలిబాన్ గ్రూపు ప్రతినిధులు తమ నేత బతికే ఉన్నాడని ప్రకటించారు. ఈ ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. బైతుల్లా మెహసూద్ బతికే ఉంటే, ఆధారాలు చూపించాలని పాక్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తమ వద్ద పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ మృతి చెందాడనేందుకు విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
జులై 5న పాకిస్థాన్లోని దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మెహసూద్ మృతి చెందాడని పాకిస్థాన్, అమెరికా అధికారిక వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అయితే తాలిబాన్ అగ్రనేత మెహసూద్, అతని ముఖ్య అనుచరుడు హకీముల్లా ఇద్దరూ బతికే ఉన్నారని తాలిబాన్ కమాండర్లు తరువాత ప్రకటనలు చేశారు.