పాకిస్థాన్లోని అణు కేంద్రాలపై తీవ్రవాదులు గత రెండేళ్లలో మూడుసార్లు దాడులు చేశారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను తాము ఆధీనంలోకి తీసుకుంటామని తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాద సంస్థలు గతంలో పలుమార్లు బెదిరించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే పాక్ ప్రభుత్వం మాత్రం తమ అణ్వాయుధ సంపద సురక్షితంగా ఉందని హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. పాక్ అణు కేంద్రాలపై గత రెండేళ్లలో మూడుసార్లు తీవ్రవాదులు దాడి చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటన్లోని బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ షౌన్ గ్రెగోరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
నవంబరు 1, 2007న సార్గోధాలో ఉన్న అణు క్షిపణి నిల్వ కేంద్రంపై దాడి జరిగింది. అనంతరం డిసెంబరు 10, 2007న కమ్రాలోని పాక్ అణు వైమానిక స్థావరంపై కూడా ఆత్మాహుతి దాడి జరిగిందని షౌన్ గ్రెగోరీ చెప్పారు. ఆగస్టు 20, 2008న వాఘ్ కంటోన్మెంట్ వద్ద ఉన్న ఆయుధాగారాల ప్రవేశ ద్వారాలను పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపుకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులు పేల్చివేశారు. వాఘ్ కంటోన్మెంట్ వద్దే పాకిస్థాన్ ప్రధాన అణ్వాయుధ కేంద్రం ఉంది.