పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వంలో అల్ ఖైదా సానుభూతిపరులు కీలక స్థానాలను పొందారని, ఆ తీవ్రవాద సంస్థ ఎంతటి ప్రాధాన్యత పొందినదనటానికి ఒసామా బిన్ లాడెన్ అబోట్టాబాద్లో ఉండటమే ఉదాహరణని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ రాసుకున్న తన జ్ఞాపకాల్లో వెల్లడించారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికాపై అల్ఖైదా దాడి తర్వాత అమెరికా, పాకిస్థాన్ సంబంధాల్లో అనేక ఒడిదుడుకులు ఎదురైనట్లు 2001 నుంచి 2009 వరకు జార్జిబుష్ కొలువులో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన షెనీ పేర్కొన్నారు. 2004 తర్వాతనే పరిస్థితుల్లో కొంతమార్పు వచ్చిందన్నారు. అయితే ముషారఫ్ ప్రభుత్వంలోని అల్ ఖైదా సానుభూతిపరుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. తన పాలనలో సాధించిన కీలక విదేశీ విధానంగా జార్జి బుష్ భావించే భారత్-అమెరికా సంబంధాల గురించి మాత్రం షెనీ తన 533 పేజీల పుస్తకంలో ప్రస్తావించలేదు.