తాలిబన్లు మరో అగ్రనేతను కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాలిబన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ తాలిబన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ తర్వాత.. తాజాగా ఆ సంస్థకు చెందిన మరో అగ్రనేత హకీముల్లా మెహసూద్ కూడా మృతి చెందినట్లు సమాచారం.
తెహ్రీక్ ఈ తాలిబన్ సంస్థ అగ్రనేతలైన హకీముల్లా, మరో తాలిబన్ నేత వాలీ-ఉర్-రెహ్మాన్ల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో వీరిద్దరూ మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. అంతకుముందు బైతుల్లా మెహసూద్ మృతి చెందినట్లు పాక్ ప్రభుత్వానికి సమాచారం అందింది.
దీని తర్వాత తాజాగా తెహ్రీక్ ఈలోని ఇద్దరి ప్రధాన ప్రత్యర్థుల మధ్య కాల్పులు జరిగినట్లు పాక్ ప్రభుత్వ మరో సమాచారం అందుకున్నట్లు మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు అగ్రనేతలు తీవ్రంగా గాయపడి ఉండవచ్చు.. లేదా.. మృతి చెంది ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం.
కాగా, పాక్ అంతర్గత మంత్రి రెహ్మాన్ మాలిక్ విలేకరులతో మాట్లాడుతూ, వాలీ-ఉర్-రెహ్మాన్, హకీముల్లా మెహసూద్ల మధ్య కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరు మృతి చెందారనే విషయంపై తర్వాత నిర్ధారిస్తామన్నారు.
మరోవైపు.. ప్రస్తుతం వస్తున్న వార్తలు వెలువడక ముందు.. అమెరికా క్షిపణి దాడుల్లో తమ నేత బైతుల్లా మెహసూద్ మృతి చెందలేదని హకీముల్లా ప్రకటించాడు. బైతుల్లా సురక్షిత ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లు హకీముల్లా పాక్ మీడియాకు తెలిపాడు.