నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచేందుకు, విస్తరించేందుకు తాజా పర్యటనలో ఆయన భారత నేతలతో చర్చలు జరుపుతారు. నేపాల్ ప్రధానమంత్రిగా మాధవ్ కుమార్ భారత పర్యటనకు వస్తుండటం ఇదే తొలిసారి.
ఆయన ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణలతో సమావేశమవతారు. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు, ఇరుదేశాలకు ఆందోళనకరంగా ఉన్న అంశాలపై కూడా మాధవ్ కుమార్, భారత నేతల మధ్య చర్చలు జరుగుతాయి.
నేరస్థుల అప్పగింత ఒప్పందం, 1950నాటి శాంతి- మైత్రీ ఒప్పందంపై సమీక్ష, భూటాన్ శరణార్థుల సమస్య, నేపాల్ శాంతి ప్రక్రియ, భద్రత, సరిహద్దుకు సంబంధించిన అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య ఈ సందర్భంగా చర్చలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి.