బర్మా మిలిటరీ జుంతా తీసుకుంటున్న నిర్ణయాలు, సాగిస్తున్న పాలనపై అమెరికా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మయన్మార్ కోర్టు మంగళవారం ప్రజాస్వామ్య యోధురాలు అంగ్ సాన్ సూకీకి మరో 18 నెలల గృహ నిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. కోర్టు మొదట ఆమెకు మూడేళ్ల గృహ నిర్బంధాన్ని ప్రకటించగా, మిలిటరీ పాలకులు శిక్షను సగానికి తగ్గించారు.
తాజా పరిణామంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అసంతృప్తి వ్యక్తం చేశారని, దీనిని అన్యాయంగా వర్ణించారని అధికారిక వర్గాలు తెలిపాయి. సూకీ (64) విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి పీజే క్రౌవ్లే పేర్కొన్నారు. బర్మా ప్రభుత్వ తీర్పుతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని తెలిపారు.