లండన్లోని బ్రిటీష్ పార్లమెంట్ భవంతిపై పర్యావరణ పరిరక్షణకు చెందిన గ్రీన్పీస్ కార్యకర్తలు ఎక్కారు. ఇందులో ఓ భారతీయుడుండటం గమనార్హం. వీరు బ్రిటన్తోపాటు అభివృద్ధి చెందిన దేశాలలో పర్యావరణాన్ని రక్షించమని వేడుకుంటున్నారు.
గ్రీన్పీస్కు చెందిన భారతదేశపు ప్రతినిధి బ్రుకేష్ సింగ్ మరియు ఇతర కార్యకర్తలు ఆదివారంనాడు పార్లమెంట్ భవంతిపైనున్న క్లాక్ టవర్ పక్కనున్న భవంతిపైకి ఎక్కారు.
ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణాన్ని రక్షించమని తమ సంస్థకు చెందిన ఇరవై మంది కార్యకర్తలు పార్లమెంట్ భవనంపైకి ఎక్కారన్నారు.
బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో భారతీయులది ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని, ఇందుకుగాను తాను భారతదేశం నుంచి వచ్చానని ఆయన తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణాన్ని రక్షించే బాధ్యతను, పర్యావరణ సమస్యకు తామే బాధ్యులమనే విషయాన్ని నమ్మకపోతే భవిష్యత్తులో తమ సంస్థ నుంచి ప్రతీకార జ్వాలలను ఎదుర్కోక తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇదిలావుండగా తమ దేశం కోపెన్హగ్లో డిసెంబర్లో జరుగనున్న సమ్మేళనంలో పాల్గొని పర్యావరణాన్ని రక్షించేందుకు తమ అంగీకారం తెలుపబోతోందని ఆయన అన్నారు.
కాగా ప్రస్తుతమున్న పర్యావరణానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలే ప్రధాన కారణమని, దీనికి బాధ్యత వహిస్తూ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు రావాలని ఈ సందర్భంగా పలు అభివృద్ధి చెందిన దేశాలకు పిలుపునిచ్చారు.