మన పొరుగు దేశం చైనా.. 60వ జాతీయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకోనుంది. ఇందుకోసం ఆ దేశ రాజధాని బీజింగ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చైనా ఆవిర్భావాన్ని కమ్యూనిస్టు నాయకుడు మావో 1949లో ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన తియాన్మన్ స్కేర్ అనే ప్రాంతంలోని ఈ జాతీయ పండగ సంబరాలు అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గత యేడాది జరిగిన బీజింగ్ వేడుకలను తలపించేలా జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆ దేశ పాలకులు వెల్లడించారు. ముఖ్యంగా.. తన సైనిక సంపత్తిని ప్రపంచానికి చాటేలా వేలాది మంది సైనికులతో భారీ పెరేడ్ను చైనా రక్షణ శాఖ నిర్వహించనుంది. సుమారు గంట పాటు జరిగే ఈ వేడుకల్లో ఆ దేశ నాయకులందరూ పాల్గొంటున్నారు. మరో అర్థగంట పాటు 30 బ్లాకుల ఆయుధాలను ప్రదర్శించనున్నారు.
ప్రతి 40 సెకండ్లకు ఒకసారి జవాన్లు తళుకులీనే కాంతులను వెదజల్లడం ద్వారా అతిథులను, ఆహుతులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయనున్నారు. మూడు లక్షల షెల్స్తో బాణాసంచా పేల్చనున్నారు. బీజింగ్ నడిబొడ్డున అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, లోహ విహాంగాలు సందడి చేయనున్నాయి. ప్రధానంగా.. చైనా సొంత పరిజ్ఞానంతో రూపొందించిన అధునాతన అణు క్షిపణులతో పాటు 52 రకాల సరికొత్త ఆయుధాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రదర్శించనుంది.
దీనిపై జాతీయ దినోత్సవ మిలిటరీ పెరేడ్ జాయింట్ కమాండ్ జనరల్ జావో జియాంగ్ స్పందిస్తూ.. ఈ సైనిక కవాతు, ప్రదర్శన పొరుగుదేశాలను భయపెట్టేందుకు కాదని, గత 60 సంవత్సరాల్లో తాము సాధించిన విజయాలకు గుర్తుగా ప్రదర్శిస్తున్నట్టు వివరించారు.