ఉత్తర చైనాలోని షాంజీ ప్రావీన్స్లో ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 11 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లతైంది. జిన్జోంగ్ నగరంలోని బొగ్గు గనిలో సోమవారం గ్యాసు పేలుడు సంభవించినట్లు స్థానిక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను గని నుంచి వెలికి తీశారు.
మరో ముగ్గురు గనిలోనే చిక్కుకొని ఉన్నారని, వారి పరిస్థితిపై ఎటువంటి సమాచారం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గని ద్వారం వద్ద పని చేస్తున్న ఇద్దరు కార్మికులు మాత్రం ఎటువంటి హాని జరగకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గత రాత్రి మొత్తం గని వద్ద సహాయక కార్యక్రమాలు కొనసాగాయి. ప్రవేశద్వారం వద్ద శిథిలాలను మాత్రమే ఇప్పటివరకు తొలగించగలిగారు. గని లోపలి గాలింపు చర్యలు ప్రారంభం కాలేదని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.