నేపాల్ మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రపండ భారత్, అమెరికాలను లక్ష్యంగా చేసుకొని సంచలన ఆరోపణలు చేశారు. చైనా వ్యతిరేక ప్రచారాన్ని సాగించేందుకు, అవసరమైతే దాడి చేసేందుకు నేపాల్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు కుట్ర పన్నాయని ప్రచండ ఆరోపించారు.
చైనా వ్యతిరేక కార్యకలాపాలు సాగించేందుకు తమ పార్టీ సాయపడనందుకే తాను ప్రధానమంత్రి బాధ్యతలకు రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రచండ చెప్పినట్లుగా రాజధానీ డైలీ వెల్లడించింది. అమెరికా- భారత్ కుట్రను మావోయిస్టు పార్టీ వ్యతిరేకించింది. దీంతో కొద్దికాలం క్రితం వరకు నేపాల్లో అధికారంలో ఉన్న మావోయిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర ప్రారంభమైందని ప్రచండ తెలిపారు.
ఆర్మీ చీఫ్ తొలగింపు వివాదంపై సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములతో భేదాభిప్రాయాల కారణంగా ప్రచండ నేపాల్ ప్రధానమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన ప్రభుత్వం కూలిపోయేందుకు భారత్ కారణమని ప్రచండ గతంలోనూ ఆరోపించిన సంగతి తెలిసిందే.