ఇరాక్ రాజధాని బాగ్దాద్, మోసూల్ నగరాల్లో సంభవించిన నాలుగు బాంబు పేలుళ్లలో 42 మంది మృతి చెందగా, సుమారు 160 మంది గాయపడ్డారు. ఉత్తర ఇరాక్లో ఉన్న మోసూల్ నగరంలో సోమవారం జరిగిన రెండు ట్రక్ బాంబు దాడుల్లో 25 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే బాగ్దాద్ నైరుతీ ప్రాంతంలో జరిగిన మరో రెండు కారు బాంబు దాడుల్లో 17 మంది మృతి చెందారు. మరో 82 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
గత వారం మోసూల్ నగరం వెలుపల షియా ముస్లిం మసీదుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత 18 నెలల కాలంలో ఇరాక్లో తీవ్రవాద దాడులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మోసూల్, మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ తీవ్రవాద దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి.