Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్ఘన్ రాజధానిలో ఐదు రాకెట్ దాడులు

Advertiesment
రాకెట్ దాడులు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం ఐదు రాకెట్ దాడులు జరిగాయి. వీటిలో ఒక రాకెట్ అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో పేలింది. కాబూల్‍‌లో అనూహ్యంగా ఈ రాకెట్ దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. మరో మూడు వారాల్లో దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా రాజధానిలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

నగర తూర్పు భాగంలో దాడులు జరిగాయని పోలీసులు, ప్రత్యేక్ష సాక్షులు చెప్పారు. దాడులు జరిగిన ప్రదేశాలు అంతర్జాతీయ విమానాశ్రయం, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉన్నాయి. అమెరికా దౌత్యకార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనూ ఓ రాకెట్ దాడి జరిగింది. అమెరికా దౌత్యకార్యాలయం సెంట్రల్ కాబూల్‌లోని ప్రధాన రోడ్డుపై ఉంది. ఈ రాకెట్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఇంటిలోకి దూసుకెళ్లింది.

ఈ దాడిలో ప్రాణనష్టమేమీ సంభవించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎం1 శ్రేణి రాకెట్లను తాజా దాడులకు తీవ్రవాదులు ఉపయోగించారని భద్రతా యంత్రాంగం భావిస్తోంది. నగరం మొత్తం భద్రత పటిష్టంగా ఉందని, ఈ రాకెట్లు చాలా దూరం నుంచి ప్రయోగించి ఉంటారని అధికారులు తెలిపారు. ఈ తరహా రాకెట్‌లను లక్ష్యానికి కొన్ని మైళ్ల దూరం నుంచి ప్రయోగించే అవకాశం ఉందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu