ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ కర్జాయ్కు ప్రధాన ప్రత్యర్థి, మాజీ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లా గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటివరకు లెక్కించిన ఫలితాల్లో ఇద్దరికీ దాదాపుగా సమానంగా ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా పది శాతం పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయినట్లు మంగళవారం ఆఫ్ఘనిస్థాన్ ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఆఫ్ఘనిస్థాన్లో ఈ నెల 20న అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టమవడానికి, రాజకీయ సుస్థిరతగా కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే పోటీ చేసిన అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు రావాలి. ఇలా రాకుంటే మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు మళ్లీ ఎన్నికలు పెడతారు.
ఇప్పటివరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాలకు సుమారు చెరో 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే ఆఫ్ఘన్ అధ్యక్ష పీఠానికి మళ్లీ జరిగే ఎన్నికల్లో కర్జాయ్, అబ్దుల్లా పోటీ పడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి తలెత్తితే తరువాతి ఎన్నికలు అక్టోబరులో జరుగుతాయి. సెప్టెంబరు ప్రథమార్ధం పూర్తయ్యే వరకు తాజా ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారిక యంత్రాంగం భావిస్తోంది.