ఆగస్ట్ 28న నూతన ప్రధానమంత్రి ఎన్నిక కోసం నేపాల్ పార్లమెంట్లో తొలి రౌండ్ ఓటింగ్ జరుగనుంది. జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు గానూ అధ్యక్షుడు రామ్భరణ్ యాదవ్ ఇచ్చిన పది రోజుల గడువులోగా ప్రధాన పార్టీలు అంగీకారానికి రావడంలో విఫలమయ్యాయి.
పార్లమెంట్ చట్టసభల సలహా కమిటీ ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి పదవి ఎన్నిక తొలి రౌండ్కు రేపు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఆగస్ట్ 31న రాజ్యాంగ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నందున ఆపద్ధర్మ ప్రధాని ఝలానాధ్ ఖానల్ నేతృత్వంలోని క్యాబినేట్ రాజ్యాంగ అసెంబ్లీని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.