అణు కార్యక్రమం విషయంలో తమపై సృష్టిస్తున్న దుమారానికి దూరంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం అగ్రరాజ్యాలకు పిలుపునిచ్చింది. తమ శాంతియుత అణు కార్యక్రమానికి అడ్డుతగిలే చర్యలను మానుకోవాలని ఇరాన్ ప్రభుత్వం సూచించింది. దీనికి బదులుగా చర్చల ద్వారా అణు సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ముందుకురావాలని కోరింది.
వారి విధానాలను మార్చుకునేందుకు ఇది సరైన సమయం. ఇరాన్కు అడ్డుతగిలే చర్యలను పక్కనబెట్టి, చర్చలు జరిపేందుకు మిగిలిన పార్టీలు (అగ్రరాజ్యాలు) ముందుకురావాలని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హసాన్ ఘాష్ఘావీ విలేకరులతో చెప్పారు. అగ్రరాజ్యాలు, ఇజ్రాయేల్ వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో ఇరాన్పై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
అగ్రరాజ్యాలు ఇరాన్ అణు కార్యక్రమం అణ్వాయుధాలకు ఉద్దేశించిందని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పశ్చిమదేశాల ఈ ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించినదేనని ఇరాన్ బలంగా వాదిస్తోంది.