కాశ్మీర్లోకి చొరబడిన టెర్రరిస్టులు... పాక్ సరిహద్దు మూసేస్తున్న చైనా.. యుద్ధానికి సిద్ధమైన తైవాన్
కాశ్మీర్ లోయల్లోని మంచు కొండల్లోకి తీవ్రవాదులు ప్రవేశించారు. జనవరి నెలలో భారత్లో విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాదులు భారీ ప్లాన్ వేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం హిజుబుల్ ముజాహిదీ
కాశ్మీర్ లోయల్లోని మంచు కొండల్లోకి తీవ్రవాదులు ప్రవేశించారు. జనవరి నెలలో భారత్లో విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాదులు భారీ ప్లాన్ వేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం హిజుబుల్ ముజాహిదీన్తో పాటు.. లష్కర్ ఈ తోయిబా తీవ్రవాద సంస్థలు ఏకమైనట్టు పేర్కొన్నాయి. అందువల్ల జనవరి నెలంతా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర హోంశాలకు నోట్ జారీ చేసింది. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో మంచు విపరీతంగా పడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు.. దక్షిణ కాశ్మీర్లోకి ప్రవేశించి, అక్కడ మంచు చరియలపై ఆట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నిఘా వర్గాలు సంపాదించాయి.
ఇదిలావుండగా, అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్థాన్ సరిహద్దు పొడవునా భద్రతను చైనా కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు జిన్జియాంగ్ ప్రభుత్వం వెల్లడించినట్టు అక్కడి అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా పేర్కొంది. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలం కావడంపై చైనా ఎంత అసహనంతో ఉందో తాజా పరిణామాలు చెప్పనే చెబుతున్నాయి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో శిక్షణ తీసుకున్న తీవ్రవాదులు ఇక్కడికి తిరిగి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు జిన్జియాంగ్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జిన్జియాంగ్లోని హోటన్లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడింది.
మరోవైపు.. చైనా విమానవాహక నౌక తైవాన్ సముద్ర జలాల్లో నుంచి ప్రయాణిస్తుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. తైవాన్ వెంటనే అప్రమత్తమై తన యుద్ధవిమానాలను, నౌకలను సిద్ధం చేసింది. దీంతో తైవాన్, చైనాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిపోయింది. రష్యా నిర్మించి ఇచ్చిన ఈ విమాన వాహనక నౌక దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు నిర్వహించి తిరుగుపయనమైంది. ఇది తైవాన్ జలాల్లోకి ప్రవేశించినట్లు తెలియడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తైవాన్ ప్రతినిధి చాన్ చుంగ్ చీ తెలిపారు. 'తైవాన్కు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు.. భయపడాల్సిన అవసరం లేదు' అని పేర్కొన్నారు.