100 మంది ఉగ్రవాదులతో పాక్ రెడీగా ఉంది.. ఎందుకో తెలుసా?
నియంత్రణ రేఖను దాటి భారత సైనికులు ఉగ్రస్థావరాలపై చేసిన దాడితో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు యుద్దం సంభవిస్తుందో తెలియక దేశ ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.
నియంత్రణ రేఖను దాటి భారత సైనికులు ఉగ్రస్థావరాలపై చేసిన దాడితో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు యుద్దం సంభవిస్తుందో తెలియక దేశ ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. మరోవైపు దాదాపు 90 శాతం మంది ప్రజలు పాక్తో యుద్దం చేసి పాక్ ముక్కు నేలకు రాయాలని భావిస్తున్నారు. దీనికి యుద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సహిస్తూ వచ్చింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్థాన్ ఎగదోస్తోంది.
ఉగ్రవాదులకు పాకిస్థాన్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఒక ఎత్తు. ఇతర దేశాల్లో విధ్వంసం సృష్టించి వచ్చిన ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పించడం మరో ఎత్తు. 15 ఏళ్ల క్రితం, 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో దాడులు జరిపిన అల్ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు బిన్ లాడెన్కే పాక్ ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఉరీలో సైనిక స్థావరంపై దాడి జరిపి 18 మంది వీర సైనికుల సజీవ దహనానికి పాక్ కారణమైంది. ఈ దుర్మార్గం పాక్ ఉగ్రవాదానికి పరాకాష్ఠ. ఇటీవల అరెస్టయిన పాకిస్థాన్ ఉగ్రవాది బహదూర్ అలీ, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆ దేశ సైనికులు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల గురించి, కంట్రోల్ రూం గురించి జాతీయ పరిశోధన సంస్థకు అనేక విషయాలు వెల్లడించాడు.
సర్జికల్ దాడుల తరువాత కూడా బుద్ధి తెచ్చుకోని పాకిస్థాన్, సరిహద్దుల్లో ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పెడుతూ మరోవైపు ఇండియాలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయాలని కుట్రపన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. సరిహద్దులు దాటి దాడులకు తెగబడేందుకు 100 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధంగా ఉంచిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
సరిహద్దుల్లో సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. ఎందరు ఉగ్రవాదులు వచ్చినా వెనకడుగు లేదని, వారిపై విరుచుకుపడి గుణపాఠం చెప్పేందుకు జవాన్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కాగా, గడచిన 36 గంటల్లో ఆరు సార్లు పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయని, సాధారణ పౌరుల ఆవాసాలు లక్ష్యంగా కూడా పాక్ సైన్యం తెగబడుతోందని, రక్షణ శాఖ మానవ సంబంధాల అధికారి మానిష్ మెహతా పేర్కొన్నారు. మోర్టారు బాంబులు, ఆటోమేటిక్ ఆయుధాలతో పాక్ సైన్యం కాల్పులు సాగిస్తుండగా, వాటిని సైనికులు విజయవంతంగా అడ్డుకున్నారని తెలిపారు.