Publish Date: Sat, 09 Oct 2021 (19:47 IST)
Updated Date: Sat, 09 Oct 2021 (20:15 IST)
కాంగోలో పడవలు మునిగిపోవడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా మరో పడవ కూడా నదిలో మునకేసింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మరణించారు. కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. 100 మంది పైగా మునిగిపోగా.. 51 మృతదేహాలు ఇప్పటివరకు బయటకు తీశారు.
ప్రమాదం నుంచి 39 మంది సురక్షితంగా బయటపడ్డారు. కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదాన్ని వాయవ్య ప్రావిన్స్ మొంగాలా గవర్నర్ అధికార ప్రతినిధి నెస్టర్ మగ్బాడో ధ్రువీకరించారు.
పడవ ఎక్కే ముందు ప్రయాణికులను లెక్కించలేదని గవర్నర్ ప్రతినిధి మగ్బాడో చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో, పడవ సీటింగ్ సామర్థ్యాన్ని చూసి తప్పిపోయిన వారి సంఖ్యను అంచనా వేస్తున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
సాధ్యమైనంత ఎక్కువ మందిని సజీవంగా రక్షించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. రాత్రి సమయంలో చెడు వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని లేదా పడవలో రద్దీ కూడా కారణం కావచ్చునని మగ్బాడో చెప్పారు. ప్రావిన్షియల్ అధికారులు మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.