Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో మరో కరోనా వైరస్ కేసు... చైనా నుంచి వచ్చిన ఇండియన్స్

కేరళలో మరో కరోనా వైరస్ కేసు... చైనా నుంచి వచ్చిన ఇండియన్స్
, ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (12:07 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఓ కేసు నమోదుకాగా, తాజాగా మరో కేసు బయటపడడంతో దేశీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని కరోనా వైరస్ బారిన పడినట్లు మూడు రోజుల క్రితం గుర్తించిన విషయం తెలిసిందే. ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
తాజాగా చైనాలో పర్యటించి వచ్చిన ఓ వ్యక్తి కూడా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర వైద్యవర్గాలు తెలిపాయి. 
 
ఇదిలావుంటే చైనాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే పనులు చురుకుగాసాగుతున్నాయి. మొత్తం 323 మంది ప్రయాణికులతో ఉన్న రెండో ప్రత్యేక విమానం ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ చేరింది. వూహాన్లో తెల్లవారు జామున 3.10 గంటలకు ఈ విమానం బయలుదేరింది. 
 
వచ్చిన వారిలో ఏడుగురు మాల్దీవుల నివాసితులు ఉన్నారని చైనాలోని భారత్ రాయబారి విక్రమ్ మిస్త్రీ ట్వీట్ చేశారు. కాగా, శనివారం తొలి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న 324 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచారు. ఇప్పుడు వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
చైనాలో పరిస్థితి, కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరును చూసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఏమెర్జెన్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చైనాలో చదువుతున్న, సందర్శనకు వెళ్లిన వారిని రప్పించేందుకు భారత్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్నోలో విశ్వహిందూ మహాసభ నేత దారుణ హత్య