Publish Date: Fri, 10 Apr 2020 (15:01 IST)
Updated Date: Fri, 10 Apr 2020 (15:02 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలను పూడ్చేందుకు చోటు లేకపోవడంతో న్యూయార్క్లో బ్రాంక్స్ సమీపంలోని ఓ ద్వీపం (హార్ట్ ఐలాండ్) లో సామూహిక ఖననం చేశారు.
భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులు గానీ, తెలిసినవారు గానీ ఎవరూ లేకుండానే అంత్యక్రియలను నిర్వహించారు. ఇప్పటి వరకు న్యూయార్క్ నగరంలోనే దాదాపు ఒక లక్షా 59 వేల మంది కరోనా బారినపడగా దాదాపు 7067 మంది మృతిచెందారు. ఇక అమెరికా వ్యాప్తంగా 4,68,703 మందికి కరోనా సోకగా, 16,679 మంది మృతి చెందారు.
ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద ఎకానమీగా, ఆరో ధనవంతమైన దేశంగా విలసిల్లిన ఇటలీలో అసలు లోపాలు కరోనా విలయం తర్వాత గానీ బయటపడలేదు. కోవిడ్-19 రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సులకు కనీస రక్షణ సదుపాయాలు కూడా లేవు. బయటి దేశాల నుంచి తెప్పించుకునేలోపే పరిస్థితి ముదిరింది.
మరే దేశంలోనూ లేని విధంగా ఇటలీలో ఇప్పటిదాకా 100 మంది డాక్టర్లు కరోనా కాటుకు బలయ్యారు. వాళ్లతోపాటు 30 మంది నర్సులు కూడా చనిపోయారు.