ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆ దేశంలోని అణు స్థావరాలే లక్ష్యంగా బాంబులు వేసింది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండరాదన్న ఏకైక లక్ష్యంతోనే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. తాజాగా ఈ దాడులను ఉధృతం చేసింది. ఇరాన్లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అణు కేంద్రం నుంచి ఎలాంటి ప్రమాదకర వాయువులు విడుదల కాలేదని అంటున్నారు.
ఈ దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాలు తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం, డ్రోన్ యూనిట్ కమాండర్ను చంపాలని ఐడీఎఫ్ ప్రకటించింది. టెల్ అవీవ్పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిథ్యం వహించాడని తెలిపింది.
ఇదిలావుంటే, శుక్రవారం ఐడీఎఫ్ సిబ్బందితో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇరాన్ పాలనను అస్థిరపరచడానికి దాడులను మరింతగా ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని, టెహ్రాన్లోని శక్తిమంతమైన బాసిజ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వంటి కేంద్రాలను ధ్వంసం చేయాలని ఆయన సూచించారు.