ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మారణహోమంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఐఎస్ రెండేళ్ల కాలంలోనే సుమారు నాలుగు వేలమందికి పైగా పొట్టనబెట్టుకున్నట్లు ఇంగ్లాండులోని మానవ హక్కుల సంస్థ ఒకటి పేర్కొంది. ఏకంగా నాలుగు వేలమందిని ఉరి తీసి ఉసురు తీసినట్లు వెల్లడించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది. పొరుగు దేశాలకు సమాచారం అందిస్తున్నారన్న నెపంతో తమ సొంత కుటుంబ సభ్యులను సైతం హతమారుస్తూ భయానకం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
అంతేకాదు ఇటీవలే తమ ఆదేశాలకు అనుగుణంగా సెక్స్ బానిసలుగా కొనసాగేందుకు 250 మంది బాలికలు నిరాకరించారనీ అందరూ చూస్తుండగానే వారిని అతి కిరాతకంగా తలలు నరికి హత్య చేసింది. తమ అధీనంలో ఉన్న ఇరాక్లోని మోసుల్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి. ఐఎస్ఐఎస్ తరపున పనిచేస్తున్న ఉగ్రవాదులను తాత్కాలికంగా పెళ్లాడి వారి సెక్స్ కోర్కెలు తీర్చాలంటూ ఇసిస్ ఫర్మానా విధించింది.
తమ ఆదేశాలను ఎవరైనా నిరాకరిస్తే హత్య చేస్తామని హెచ్చరించింది. ఐనప్పటికీ బాలికల్లో 250 మంది ఎదురుతిరగడంతో వారినంతా వరుసగా తలలు నరికి కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘాతుకం ఆ బిడ్డల తల్లిదండ్రుల ముందే జరిపించినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ దారుణాలను ఆపేందుకు ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగాలని వారు అభ్యర్థిస్తున్నారు.