Publish Date: Tue, 12 Jul 2022 (08:40 IST)
Updated Date: Tue, 12 Jul 2022 (08:46 IST)
పాకిస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల రోజుల్లో 147 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 88 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
బెలూచిస్థాన్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 63 మంది వర్షాల కారణంగా మృతి చెందారు. సింధు ప్రావిన్స్ రాజధాని కరాచీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఇస్లామాబాద్లోనూ భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోర్ట్ సిటీ కరాచీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలావరకు ప్రాంతాలు నీట మునిగాయి.
వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయని, ఈ సమయంలో వాహనాల కంటే బోట్లే అవసరమని బాధితులు చెబుతున్నారు.