డ్రాగన్ కంట్రీ చైనాలో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ఆ దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. పైగా, చైనా శత్రుదేశంగా భావించే భారతదేశం జనాభా పెరిగిపోతోంది. దీంతో చైనా దేశ జనాభాను పెంచడానికి సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఓ బిడ్డకు జన్మనిస్తే రూ.43 వేలు ఇస్తామని ప్రకటించింది.
పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాలలోకి ఒక్కో బిడ్డకు యేటా 3600 యువాన్ (సుమారు రూ.43వేలు) నగదు బదిలీ చేసేందుకు ప్రణాళికలు రచించింది. పిల్లలకు మూడేళ్ల వయసు వచ్చేవరకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్టు చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు చైనా మంత్రివర్గం పరిశీలిస్తుందని ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ కథనం పేర్కొంది. పిల్లల పెంపకంలో భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
గత యేడాది చైనాలో 90 లక్షల 54 వేల మంది జన్మించారు. ఈ సంఖ్య 2016లో జననాల్లో కేవలం సగం మాత్రమే. చైనా ప్రభుత్వం 30 ఏళ్ల పాటు ఒకరే సంతానం ఉండాలన్న విధానాన్ని అమలు చేసి 2016లో రద్దు చేసింది. చాలా మంది పెళ్లి చేసుకోవడం లేదని, పిల్లలను కనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని, పెరుగుతున్న ఆర్థిక భారమే ఇందుకు కారణమని చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొత్త పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది.