ఆఫ్రికా దేశాల్లో ఒకటైనా బుర్కినా ఫోసాలో జిహాదీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దేశ ఉత్తర ప్రాంతంలో అల్ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నస్ర్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ (జేఎన్ఐఎం) జరిపిన భీకర దాడిలో వంద మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మరణించిన వారిలో అత్యధికులు సైనికులు కావడం గమనార్హం.
ఉత్తర బుర్కినా ఫాసోలోని కీలకమైన జిబో పట్టణంతో పాటు అక్కడ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఏకకాకంలో దాడులకు తెగబడ్డారు. బుర్కినా ఫాసోలో తీవ్రంగా ప్రభావితమైన వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్న ఓ సహాయక కార్యకర్త ఈ విషయాన్ని తెలిపారు.
ఈ దాడిలో తన తండ్రి కూడా మరణించినట్టు ఆ ప్రాంతానికి ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీకార చర్యలకు భయపడి వీరిద్దరూ తమ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. సాహెల్ ప్రాంతంలో చురుకుగా వ్యవహరిస్తున్న జేఎన్ఐఎం ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించుకుంది.
గతంలో జిబోపై జరిగిన దాడులను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ, ఈ సారి మాత్రం ఉగ్రవాదులు ఎలాంటి వైమానికి ప్రతిఘటన లేకుండా గంటల తరబడి ఆ ప్రాంతాల్లో బీభత్సం సష్టించారని ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియోలను అధ్యయనం చేసిన స్వతంత్ర విశ్లేషకుడు చార్లీ వెర్బ్ పేర్కొన్నారు.