2025వ సంవత్సరం భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఫహల్గమ్, అహ్మదాబాద్ వంటి ఘటనలతో భారీగా ప్రాణనష్టం ఏర్పడింది. ఇవి చాలదన్నట్లు విదేశాల్లో గాజాలో దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
నగరంలోని ప్రఖ్యాత టైగర్ టవర్గా పిలువబడే 67 అంతస్తుల మెరీనా పినాకిల్ నివాస భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భవనంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. భవనంలోని 764 ఫ్లాట్లలో నివసిస్తున్న సుమారు 3,820 మందిని అత్యంత వేగంగా, సురక్షితంగా బయటకు తరలించారు.
అదృష్టవశాత్తూ ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు, నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.