చైనాలో శక్తిమంతమైన టోర్నడో, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో దాదాపు 78 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా గాయపడ్డారు. దీంతో తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడటం, ఇతర విపత్తులకు దాది తీసిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం కురిసిన కుంభవృష్టి, వడగండ్ల వాన, టోర్నడోలు యాన్చెంగ్ సిటీలో విధ్వంసం సృష్టించాయి. గంటకు 125 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భవనాలు కూలి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వృక్షాలు నెలకొరిగాయి.
లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. కూలిన ఇండ్ల నుంచి బాధితులను కాపాడటానికి సహాయక సిబ్బంది ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న గ్రామాల్లో యాన్చెంగ్ సిటీకి చెందిన ఉన్నతాధికారులు సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టారు.