దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడే నల్ల సూరీడు నెల్సన్ మండేలా నేడు 91లోకి అడుగిడారు.
దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తన జీవితంలోని అతి ముఖ్యమైన కాలాన్ని జైలులోనే గడిపిన దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడే నెల్సన్ మండేలా తన 91వ జన్మదినాన్ని నిరాడంబరంగా జురుపుకున్నారు.
ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్, దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు జాకోబ్ జూమా తదితర ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఈయన ఒకరు.
ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు.
తన పూర్వపు విమర్శకులనుంచికూడా ప్రశంసలు అందుకొన్నారు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి.
ఇదిలావుండగా తన పుట్టిన రోజునాడు ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనాలని అదే తనకు నిజమైనే సంతృప్తినిస్తుందని ఆయన ప్రజలకు చెప్పారు.
కాగా ప్రజలందరూ సుఖ శాంతులతో విరాజిల్లాలని తాను కోరుకుంటున్నట్లు తన పుట్టిన రోజు సందర్భంగా ఆకాంక్షించారు.