సిడ్నీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ప్రమాదానికి గురైన మహిళ ఎనిమిది నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్గా గుర్తించారు. సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అటువైపుగా ఓవచ్చిన ఓ కియా కార్నివాల్ కారు డ్రైవర్ వారికి దారి ఇచ్చేందుకు వేగాన్ని తగ్గించారు.
సరిగ్గా అదే సమయంలో, వెనుకవైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఒక బీఎండబ్ల్యూ సెడాన్, కియా కారును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కియా కారు అమాంతం ముందుకు దూసుకుపోయి, రోడ్డు దాటుతున్న సమన్వితను బలంగా తాకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ మరణించారు. అయితే కియా కార్నివాల్ నడుపుతున్న 48 ఏళ్ల వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును నడుపుతున్న ఆరోన్ పాపజోగ్లూ (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.